
AIMIM chief Asaduddin Owaisi: 2002 గుజరాత్ అల్లర్ల క్రమంలో బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులను త్వరగా విడుదల చేయడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గర్భవతి అయిన బిల్కిస్ బానోపై సామూహిక లైంగికదాడికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులను ఇటీవల గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, దోషులు బ్రాహ్మణులు అనీ, మంచి సంస్కారం ఉన్నవారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇదే విషయాన్ని ఒవైసీ ప్రస్తావిస్తూ.. బీజేపీ, గుజరాత్ సర్కారుపై విమర్శలు చేశారు. గుజరాత్ అయినా, కథువాలో అయినా రేపిస్టులకు బీజేపీ అండగా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బిల్కిస్ బానోపై రేపిస్టులు 'సంస్కార్' ఉన్న బ్రాహ్మణులేనని గోద్రాలోని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే.రౌల్జీ ( BJP MLA CK Raulji) చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ వ్యాఖ్యానిస్తూ.. “కొంతమంది కులం వారు నేరం చేస్తే రుజువైనప్పటికీ జైలు నుండి విడుదల చేయబడతారు. మరికొందరి కులం లేదా మతం సరిపోతుంది.. ఎలాంటి రుజువు లేకుండా వారిని జైలులో పెట్టడానికి' అని ఆయన పేర్కొన్నారు. "కనీసం గాడ్సేను దోషిగా నిర్ధారించి ఉరితీసినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి" అని బిల్కిస్ బానో కేసులో దోషుల ఉపశమనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. "స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ మహిళా సాధికారత గురించి నొక్కిచెప్పిన రోజునే, గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసు దోషులను విడుదల చేసింది" అని కూడా AIMIM చీఫ్ గుర్తు చేసుకున్నారు. సీబీఐ విచారణలో దోషులుగా తేలినందున గుజరాత్ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకుందా? అని ప్రశ్నించారు. రానున్న గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఇవన్నీ చేస్తోందని ఒవైసీ ఆరోపించారు.
బిల్కిస్ బానో రేపిస్టులు 'మంచి సంస్కారం ఉన్న బ్రాహ్మణులు': బీజేపీ ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా, బిల్కిస్ బానో కేసులో 11 మంది రేపిస్టులు మంచి విలువలు లేదా 'సంస్కారం' కలిగిన బ్రాహ్మణులేనని, ఎవరైనా దురుద్దేశంతో వారిని శిక్షించి ఉండవచ్చని గుజరాత్లోని గోద్రాకు చెందిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే.రౌల్జీ ( BJP MLA CK Raulji) అన్నారు. సామూహిక లైంగికదాడి, హత్య కేసులో దోషుల విడుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దోషులుగా తేలిన 11 మంది రేపిస్టులకు క్షమాపణలు మంజూరు చేసిన సమీక్ష ప్యానెల్లో భాగమైన ఇద్దరు బీజేపీ నాయకులలో ఒకరైన గుజరాత్లోని పాలక శిబిరానికి చెందిన శాసనసభ్యుడు సికె రౌల్జీ దోషులకు మద్దతు ఇచ్చారు. దోషులు జైలు నుంచి విడుదలైన తర్వాత మిఠాయిలు, పూలమాలలతో సత్కరించిన దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. కమిటీ నిర్ణయం ఏకగ్రీవమైందని రౌల్జీ గురువారం న్యూస్ పోర్టల్, మోజో స్టోరీకి తెలిపారు. దోషులలో ఒకరు ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. "వారు బ్రాహ్మణులు, బ్రాహ్మణులు మంచి సంస్కారం కలిగి ఉంటారు. వారిని కార్నర్ చేసి శిక్షించాలనేది ఎవరైనా దురుద్దేశం అయి ఉండవచ్చు" అని ఎమ్మెల్యే ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఖైదీలు జైలులో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని ఆయన తెలిపారు.
బిల్కిస్ బానో కేసులో దోషులను త్వరగా విడుదల చేయడంపై కేంద్రంపై విపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీ కూడా ఈ విడుదల మహిళల పట్ల బీజేపీ ఆలోచనా ధోరణిని తెలియజేస్తోందని ట్వీట్ చేశారు. "ఉన్నాలో బీజేపీ ఎమ్మెల్యేను రక్షించడానికి పనిచేసింది. కతువాలో రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించింది. హత్రాస్ లో రేపిస్టులకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు సాగింది. గుజరాత్ లో రేపిస్టుల విడుదల చేయడంతో పాటు సన్మానించింది అంటూ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. నేరస్థులకు మద్దతు ఇవ్వడం మహిళల పట్ల బీజేపీ చిల్లర మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని అన్నారు. ఇలాంటి రాజకీయాలకు మీరు సిగ్గుపడటం లేదా? అని ప్రధాని మోడీని ప్రశ్నించారు.