
నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)కి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ మంగళవారం మూజువాణి ఓటు ద్వారా బిల్లును ఆమోదించింది. నీట్ నుంచి తమిళనాడు (Thamilnadu)ను మినహాయింపు ఇవ్వాలని ఈ బిల్ (bill)లో ప్రభుత్వం పేర్కొంది. దీనిని గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.
వాస్తవానికి ఎంకే స్టాలిన్ (M k stalin) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నీట్ ను రద్దు చేస్తూ గతేడాది సెప్టెంబర్ లోనే అసెంబ్లీ (assembly) బిల్ పాస్ చేసింది. అయితే దీనిని గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించలేదు. ఆ బిల్లు పేద విద్యార్థులకు వ్యతిరేకం అంటూ దానిని గురువారం తిరిగి పంపించారు. దీంతో కొన్ని రోజుల మందు సీఎం స్టాలిన్ ఓ ప్రకటన చేశారు. నీట్ రద్దు కోసం బిల్ ఆమోదించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశ పరుస్తామని తెలిపారు. ఆ ప్రకటన నేపథ్యంలోనే నేడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏక గ్రీవంగా బిల్ పాస్ చేశారు.
2021లో సెప్టెంబర్ లో నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలం (selam) ప్రాంతంలో ఓ మెడికల్ సీటు ఆశవాహురాలు తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. దీంతో నీట్ పై పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. మెడిసిన్, డెంటిస్ట్రీ, ఇండియన్ మెడిసిన్, హోమియోపతిలోని యూజీ కోర్సులకు ఎంట్రెన్స్ టెస్ట్ లో (12వ తరగతి) సాధించిన మార్కుల ఆధారంగా వచ్చే పదేళ్ల వరకు ప్రవేశాలు కల్పించాలని ఆ బిల్లు కోరింది.
ఎందుకు రద్దు చేసింది ?
ఇంజనీరింగ్ (engineering), మెడిసిన్ (medicine) సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం జేఈఈ మెయిన్స్ (JEE Mains), నీట్ (NEET) అనే పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు ప్రతీ ఏటా అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం నీట్ ను తమిళనాడులో నిర్వహించకూడదని చెబుతోంది. మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందాలంటే ఈ పరీక్ష తప్పని సరిగా మంచి మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంజనీరింగ్ లో సీట్లు పొందాలంటే స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్ లో పలు ఎక్జామ్స్ ఉంటాయి.. కానీ మెడిసిన్ కోసం మాత్రం నీట్ ఒక్కటే ఉండటం సరైంది కాదని తమిళనాడు భావిస్తోంది.
గతంలోనే నీట్ వల్ల వచ్చే సమస్యను అధ్యయనం చేసేందుకు స్టాలిన్ గవర్నమెంట్ ఒక కమిటిని నియమించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష ద్వారా మెడిసిన్ లో చేరిన స్టూడెంట్లు, ఇంటర్ మీడియట్ మార్కుల ఆధారంగా సీటు పొందిన వారికంటే బాగా రాణించడం లేదని ఆ కమిటి చెప్పింది. కేవలం డబ్బులున్న స్టూడెంట్లు మాత్రమే నీట్ కోసం ప్రత్యేకంగా కోచింగ్ లకు వెళ్లి, ఎక్కువ మార్కులు సాధించి అడ్మిషన్ పొందుతున్నారని ఆ కమిటి తెలిపింది. అయితే అదే సమయంలో నీట్ ఒత్తిడి వల్ల ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది. తమిళనాడులో ఇక నుంచి నీట్ నిర్వహించకూడదని నిర్ణయిస్తూ బిల్ పాస్ చేసింది. కానీ దానిని గవర్నర్ తిరస్కరించడంతో మళ్లీ బిల్ ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదింపజేసుకున్నారు.