
తమిళనాడులో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ తో డీఎండీకే అధినేత విజయ్ కాంత్ భేటీ కావడం పలు ఊహాగానాలకు తెరలేపింది. డీఎండీకే, డీఎంకేతో జతకట్టనుందని, ఈ మేరకు నిర్ణయం జరిగిపోయినట్టు సమాచారం.
విజయకాంత్ అధ్యక్షతన డిఎండికె ఏర్పడిన తర్వాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తర్వాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా.. ప్రధాన ప్రతిపక్ష స్థానం పొందింది.
ఆ తరువాత జయలలితతో విభేదించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలు పార్టీలు, ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగాయి. కానీ ఈ ఎన్నికల్లో అందరూ బోల్తా పడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డిఎండికె, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్క సీటు కూడా గెలుపొందలేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డి.ఎం.కె కూటమి లో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసిన అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Assam- Mizoram Riots : అసోం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు
ఆ తర్వాత సీఎం స్టాలిన్ కూడా అనారోగ్యంతో ఉన్న విజయకాంత్ ను ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.10 లక్షలు విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే కార్యకర్తలు నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి.
డీఎండీకే శ్రేణులు కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఏమీ సాధించలేం అని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డి.ఎం.కె కూటమిలో చేరాలని భావించాం.. అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతో పాటు డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవి చూడరాదని డిఎండికె గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరిన స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్టు సమాచారం. అదే సమయంలో డీఎంకే కూటమిలో డిఎండికె చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.