ఆ బిల్లును అడ్డుకుందాం.. జగన్ కి స్టాలిన్ లేఖ..!

By telugu news teamFirst Published Jun 23, 2021, 8:57 AM IST
Highlights

చిన్న తరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కి కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకువచ్చిందని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇండియన్ పోర్ట్స్ బిల్లు-2021 ముసాయిదా ను తమిళనాడు  ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మైనర్ పోర్టుల విషయంలో రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. 8 తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు.

చిన్న తరహా ఓడరేవులపై పెత్తనాన్ని మారిటైమ్ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కి కట్టబెట్టేలా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదా బిల్లును తీసుకువచ్చిందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చించేందుకు ఎంఎస్డీసీ ఈ నెల 24న సమావేశాన్ని తలపెట్టిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న ఇండియన్ పోర్ట్స్ యాక్ట్-1908 ప్రకారం.. మైనర్ పోర్టుల ప్రణాళిక, అభివృద్ధి, క్రమబద్ధీకరణ, నియంత్రణ వంటివి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉన్నాయని స్టాలిన్ పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి అధికారాలను ఎంఎస్డీసీకి బదిలీ చేయాలని కొత్తబిల్లులో ప్రతిపాదించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన అన్నారు. 

రాష్ట్రాలకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ బిల్లుపై అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో సహా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు.

ఈ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందితే చిన్నతరహా ఓడరేవుల విషయంలో ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యమైన పాత్ర ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.  రాష్ట్రాల అధికారాలను హరించే బిల్లును కలిసికట్టుగా అడ్డుకుందామని తీరప్రాంత రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ పిలుపునిచ్చారు. 

click me!