
తమిళనాడులోని అధికార డీఎంకే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే అధికార పత్రిక మురసోలిలో గవర్నర్లు అగ్నిపర్వతాలతో ఆడుకోవద్దు అంటూ వచ్చిన కథనంపై తీవ్రంగా స్పందించిన తమిళిసై.. అగ్నిపర్వతాలు హిమాలయాలను ఏమీ చేయలేవు అని కౌంటర్ ఇచ్చారు. వివరాలు.. డీఎంకే ప్రభుత్వంపై తమిళిసై చేసిన విమర్శల నేపథ్యంలో మురసోలి పత్రిక కథనంలో ఆమెపై విరుచుకుపడింది. తెలంగాణ గవర్నర్గా తమిళిసై తన రాజ్యాంగ బాధ్యతలో విఫలమయ్యారని.. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు సహకరించలేదని, అందుకే చెన్నైలోనే కాలం గడుపుతున్నారని విమర్శించింది. అయితే దీనిపై స్పందించిన తమిళిపై.. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై మురసోలికి వాస్తవం తెలియదని మండిపడ్డారు
‘‘తెలంగాణలో ఏమి జరుగుతోందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. తెలుగు మూలాలు ఉండి.. ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ తమిళ వేషం వేసినవారు.. గవర్నర్గా తెలంగాణ శాసనసభలో తమిళంలో తిరుక్కురళ్ సూక్తిని పఠించిన తమిళ వనితను నేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు’’ అని తమిళిపై మండిపడ్డారు.
ఏం చూసినా భయపడేవారే గవర్నర్లను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘మీకు మోడీ ఫోబియా పట్టుకుంది. భయం మిమ్మల్ని నా గురించి వ్యాసాలు రాసేలా చేస్తోంది. తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని మాట్లాడాలి’’ అని తమిళిసై పేర్కొన్నారు.
గత మూడేళ్లుగా తెలంగాణ స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఎవరు భయపడుతున్నారనే విషయం తెలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజల కోసం పనిచేసేలా చేశానని చెప్పారు.
సీరియళ్లు, సినిమాల్లో నటించి పదవుల్లోకి వచ్చిన వారికి మాత్రమే కెమెరా, మైక్ మేనియాలు ఉంటాయని విమర్శించారు. నిజాలు మాట్లాడే తమకు ఉండవని తమిళిసై అన్నారు. ‘‘మూడు రోజులు తెలంగాణలో, మూడు రోజులు పాండిచ్చేరిలో గడిపి.. దారిలో తమిళనాడులో కొన్ని కార్యక్రమాలకు హాజరైనందుకు నన్ను నిందించవద్దు. నేను బహిరంగంగా చేసే వాదనలకు సమాధానం చెప్పే ధైర్యం లేనివారే నాపై కథనాలు రాస్తున్నారు’’ అని తమిళిసై అన్నారు. తమిళుల రక్షకులమని చెప్పుకుంటున్న వారి అసలు ముఖం ఇప్పుడు బయటపడుతోందని విమర్శించారు.