
న్యూఢిల్లీ: కేరళలో కొచ్చి, కోజికోడ్లలోని ప్రముఖ మలయాళం న్యూస్ చానెల్ ఆఫీసుల్లో దాడికి దిగిన వ్యక్తులపై, ఆ కార్యాలయాల్లో సెర్చ్ చేసిన అధికారులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సీఎం పినరయి విజయన్కు న్యూస్ బ్రాడ్క్యాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) లేఖ రాసింది. సోమవారం రాసిన ఈ లేఖ గురించి ఎన్బీడీఏ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
సీఎం పినరయి విజయన్కు ఎన్బీడీఏ అధ్యక్షుడు అవినాశ్ పాండే సోమవారం లేఖ రాశారు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు కొచ్చిలోని ఏషియానెట్ న్యూస్ ఆఫీసుపై దాడికి దిగిన ఘటన, ఆ తర్వాత కోజికోడ్లోని ఏషియానెట్ న్యూస్ ఆఫీసులో పోలీసులు సెర్చ్ చేసిన ఘటనలను తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమనే అని నమ్ముతూ మీడియాపై బలప్రయోగం చేసి అది స్వేచ్ఛగా పని చేయకుండా జోక్యం చేసుకునే చర్యలను తాము ఖండిస్తున్నట్టు వివరించారు.
ఇలాంటి దాడులు, సెర్చ్లు తగవని, అంతేకాదు, ఇవి భారత రాజ్యాంగం కల్పించే భావ ప్రకటన స్వేచ్ఛ, పాత్రికేయ స్వేచ్ఛలకు అవసరమైన ప్రాథమిక అంశాలను దెబ్బతీస్తాయని వివరించారు.
Also Read: గుజరాత్ యూనివర్సిటీలో అఫ్గాన్ మహిళకు ఎంఏ గోల్డ్ మెడల్.. ‘తాలిబాన్లకు నా సమాధానమిదే’
కాబట్టి, ఏషియానెట్ ఆఫీసులో దాడికి దిగిన వ్యక్తులు, సెర్చ్ చేసిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ ఆ లేఖలో డిమాండ్ చేసింది. అంతేకాదు, జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు స్వేచ్ఛ, నిర్భయంగా వారి విధులు నిర్వర్తించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.