
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. దొంగలందరికి మోడీ ఇంటి పేరు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయమై సూరత్ కోర్టు విచారణ నిర్వహించింది.
ఈ ఏడాది మార్చి 23వ తేదీన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్షను విధించింది. సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఈ ఏడాది మార్చి 24న రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ సవాల్ చేశారు. గుజరాత్ హైకోర్టులో కూడ రాహుల్ గాంధీకి ఊరట లభించలేదు. రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు ఈ ఏడాది జూలై 7వ తేదీన కొట్టివేసింది.
దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఈ ఏడాది జూలై మాసంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత రాహుల్ గాంధీకి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు.ఈ ఏడాది జూలై 15న రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు విధించిన జైలు శిక్షపై స్టే విధించాలని కోరారు. ఈ విషయమై ఇవాళ మధ్యాహ్నం సుదీర్ఘ విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కడంతో రాహుల్ పై ఉన్న అనర్హత నుండి ఉపశమనం పొందే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.రాహుల్ గాంధీని ఎన్నుకున్న ప్రజలతోపాటు ఆయన రాజకీయ జీవితంపై ఈ శిక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.పరువు నష్టం కేసు అంత తీవ్రమైంది కాదని ఉన్నత న్యాయస్థానం తెలిపిందని రాహుల్ తరపు న్యాయవాదులు మీడియాకు చెప్పారు. . రాహుల్ గాంధీపై విధించిన అనర్హతపై లోక్ సభ సెక్రటేరియట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు వివరించారు.