అలా చేయడం వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది.. మతమార్పిడిపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

By Rajesh KarampooriFirst Published Nov 14, 2022, 5:06 PM IST
Highlights

బలవంతపు మతమార్పిడుల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇది తీవ్రమైన అంశమని పేర్కొంది. ఇది దేశ భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 28న జరగనుంది.

బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. బలవంతపు మతమార్పిడి అనేది తీవ్రమైన విషయమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చర్య దేశ భద్రతకు ముప్పు, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మతమార్పిడి విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

అది పౌరుల మనస్సాక్షి స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బలవంతపు మతమార్పిడుల కేసుల నివారణకు తీసుకున్న చర్యలు, జాగ్రత్తలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 28న జరగనుంది.

విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు పెద్దఎత్తున జరుగుతాయన్నారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా చర్యలు తీసుకుంటుంది? ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలని, బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా తీసుకున్న 22 చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని బెంచ్ కోరింది. నవంబర్ 22లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.ఈ కేసు నవంబర్ 28న తదుపరి విచారణకు రానుంది.

బెదిరింపులు, బహుమతులు, ద్రవ్య ప్రయోజనాల ద్వారా దేశంలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిల్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దీన్ని అరికట్టాలంటే భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనలను కఠినతరం చేయాలని పేర్కొన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించాలని పిటిషనర్ పేర్కోన్నారు.

మోసపూరిత మతమార్పిడుల అంశంపై బిల్లు రూపొందించి మూడు నెలల్లోగా మార్పిడుల నియంత్రణకు నివేదిక రూపొందించాలని లా కమిషన్‌ను ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలు చట్టాలు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం.. బలవంతంగా మతమార్పిడి చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా,కర్ణాటక బలవంతపు మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు.

click me!