
భోపాల్: మధ్యప్రదేశ్లో పాఠశాలల దుస్థితిని ఓ వీడియో హృద్యంగా వెల్లడిస్తున్నది. తరగతి గది పై కప్పు నుంచి నీరు ఉరుస్తుండగా.. విద్యార్థులు క్లాసు రూములోనే గొడుగులు పట్టుకుని పాఠాలు వింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి ఎక్కింది. ఈ తరగతి గదిలో కనీసం ఒక కుర్చీ లేదు.. ఒక డెస్క్ లేదు.
శిథిలావస్థలో ఉన్న భవనాలు, మురికి టాయిలెట్లు, ఉపాధ్యాయుల కొరత.. మధ్యప్రదేశ్లోని పాఠశాలలను వర్ణించాలంటే.. ఈ మూడు విశేషణలు చాలు. వర్షాకాలం వచ్చిందంటే.. వీటికి తోడు తరగతి గదుల్లోకి వరదలు రావడం, నీటిని వెతుక్కుంటూ పశువులు పాఠశాలలోకే వస్తుంటాయి.
మధ్యప్రదేశ్లో సియోని జిల్లాలోని ఖైరీ కాలన్లో ఓ ప్రభుత్వ పాఠశాలలోని దురవస్తే ఈ వీడియోలో కనిపిస్తున్నది. కేవలం పై కప్పులే కాదు.. గోడలు కూడా దుస్థితిలోనే ఉన్నాయి. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ స్కూల్కు పంపాలంటే బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ గదిలోని పై కప్పు నుంచి పెచ్చు రాలి పడింది. దీని నుంచి ఓ విద్యార్థి తృటిలో తప్పించుకున్నాడని స్కూల్ ప్రిన్సిపల్ మహేంద్ర శర్మ ఎన్డీటీవీకి తెలిపారు.
ట్రైబల్ ప్రాబల్యం గల దిందోరి జిల్లాలో గోపాల్పూర్ హైయర్ సెకండరీ స్కూల్ నుంచి వర్షం నుంచి రక్షించుకోవడానికి ఆ భవనం పై ప్లాస్టిక్ షీట్లు కప్పారు. ఈ స్కూల్లో సుమారు 400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ప్రమాదకర స్థితిలోని బిల్డింగ్లోనే తమ పిల్లలు చదువుకుంటున్నారు.
మారుమూల ప్రాంతాల్లోనే కాదు.. రాష్ట్ర రాజధాని భోపాల్లోని స్కూల్స్ కూడా దారుణంగా ఉన్నాయి. రోషన్పురలో ప్రైమరీ స్కూల్కు ఒకే భవనం ఉన్నది. అందులోనే 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు చదువుకోవాల్సి వస్తున్నది. 103 మంది విద్యార్థులు ఆ ఒక్క గదిలోనే చదువుకుంటున్నారు. వీరందరికి చదువు చెప్పడానికి ఇద్దరంటే ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఆ భవనం కూడా ఓ కమ్యూనిటీ హాల్ అని ఓ టీచర్ షబ్నమ్ ఖాన్ తెలిపారు.
ఈ పరిస్థితులను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ముందు ప్రస్తావించడానికి ఈ మీడియా సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారని, కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఓ కథనంలో పేర్కొంది.