పెళ్లికి నిరాకరించిందని 38కత్తిపోట్లు

By rajesh yFirst Published Sep 15, 2018, 8:58 PM IST
Highlights

ఇండోర్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా యువతిపై కత్తితో విరుచుకుపడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 38 సార్లు కత్తితో కసితీరా పొడిచి పరారయ్యాడు.

ఇండోర్‌: ఇండోర్ లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతో విచక్షణారహితంగా యువతిపై కత్తితో విరుచుకుపడ్డారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 38 సార్లు కత్తితో కసితీరా పొడిచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాధితురాలు మృతిచెందింది. ఈ ఘటన ఇండోర్ లోని సంఘీ కాలనీలో చోటు చేసుకుంది.  

వివరాల్లోకి వెళ్తే కమలేశ్ సాహూ(24) ఇండోర్ లోని ఓ హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. సుప్రియా  జైన్ (24) స్థానిక ప్రైవేట్ కార్యాలయంలో అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తోంది. కమలేశ్ సాహూ, సుప్రియా జైన్ ఇద్దరు సాగర్ జిల్లాలో నవోదయ పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో సాహూ సుప్రియాకు తన ప్రేమను తెలియజేశాడు. అతడి లవ్ ప్రపోజల్ ను సుప్రియా జైన్ సున్నితంగా తిరస్కరించింది. ఉన్నత చదువుల కోసం ఇండోర్ వెళ్లిపోయింది జైన్. ఈ వ్యవహారం జరిగి దాదాపు ఆరేళ్లు కావస్తోంది.

కాలం గడిచిపోతున్నా కమలేశ్ సాహూ మాత్రం సుప్రియా జైన్ ను మరచిపోలేదు. ఆమె ప్రేమను ఎలాగైనా పొందాలని ప్రయత్నించాడు. అయితే ఆరు నెలల క్రితం సుప్రియా జైన్ ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు కమలేశ్ సాహూ. ఆమె ఫేస్ బుక్ ఆధారంగా సుప్రియా జైన్ ఎక్కడ పనిచేస్తుంది అని తెలుసుకున్నాడు. ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా పెళ్లి చేసుకోవాలని కోరాడు. అందుకు సుప్రియా జైన్ అంగీకరించలేదు. తిరస్కరించింది.

తన పెళ్లిని అంగీకరించకపోవడంతో సుప్రియాజైన్ పై కక్ష పెంచుకున్న కమలేశ్ సాహూ ఆమెను రోజూ ఇబ్బందులకు గురిచేసేవాడు. దారిలో అడ్డగిస్తూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. అయితే శుక్రవారం సాయంత్రం మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అంగీకరించకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా పొడిచాడు. దాదాపు 38 సార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందతూ మృతిచెందింది. ఆమె శరీరంపై 38 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కత్తితో పొడిచిన అనంతరం కమలేశ్ సాహూ పరారయ్యాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అతని సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని సుప్రియా జైన్ కు పంపిన మెసేజ్ ను గుర్తించారు. అయితే సుప్రియా జైన్, సాహూ ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ సమయంలోనే తన ప్రేమను వ్యక్తం చేశాడని పోలీసుల విచారణలో తెలిపింది. తన ప్రేమను అంగీకరించకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని పోలీసుల విచారణలో తెలిపాడు. 

click me!