
Congress : ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలు రాబట్టింది. ఈ ఘోర పరాభవానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అంతర్గత పోరే కారణమని ఆ పార్టీ భావిస్తున్నదని స్పష్టం తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ తరహా పరిస్థితి రాకుండా ఉండేందుకు రాష్ట్ర పార్టీ నేతలు ఐక్యంగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కోరారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని సోనియా తెలిపారు.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓటమికి గల కారణాలను సోనియా గాంధీకి వివరించారు. అలాగే, హిమాచల్ ప్రదేశ్లో ఆప్ ప్రస్తుత స్థితిని సోనియాకు తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ ఇన్చార్జి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. "హిమాచల్ ప్రదేశ్లో ఆప్ సమస్య కాదు. బీజేపీ లేదా కాంగ్రెస్ నుండి టిక్కెట్లు రాని వ్యక్తులు మాత్రమే ఆప్ టిక్కెట్ నుండి పోటీ చేస్తారు" అని తెలిపారు. ఆయన రాష్ట్రంలో ఆప్ స్థితిపై పార్టీ నాయకులతో చర్చించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేయాలని కోరారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన నేతలందరూ తాము ఐక్యంగా ఉంటామని సోనియా గాంధీకి హామీ ఇచ్చారని, పంజాబ్ లాంటి పరిస్థితి అక్కడ పునరావృతం కాబోదని, కేంద్ర నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర నేతలు అంగీకరిస్తారని పార్టీ నేతలు ఏఐసీసీ చీఫ్ సోనియాకు హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్పులు అవసరం అనుకుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మరియు శాసనసభా పక్ష నేతను కూడా మార్చవచ్చని వర్గాలు తెలిపాయి, "కేంద్ర నాయకత్వం ప్రస్తుతం అధికారులను మార్చడం లేదు, కానీ దానికి సంబంధించిన సూచనలు కనిపిస్తున్నాయని" రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు మండి లోక్సభ సీటును కూడా కాంగ్రెస్ గెలుచుకుంది, అందుకే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మండి లోక్సభ స్థానంతో పాటు మరో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీని ఢీకొనేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగితేనే ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని ఈ సమావేశం నిర్ణయించినట్లు సమాచారం.