
దీర్ఘకాలంగా ఉన్న భూవివాదంపై రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘర్షణలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలో పలు వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో చోటుచేసుకుంది. వివరాలు.. లెహదా తోలా ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘర్షణ జరిగింది. జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు ప్రేమ్ యాదవ్, సత్యప్రకాష్ దూబే చాలా కాలంగా భూ వివాదంలో ఉన్నారు.
భూవివాదాన్ని పరిష్కరించేందుకు ప్రేమ్ యాదవ్ సోమవారం ఉదయం సత్యప్రకాష్ దూబే ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వారు చర్చిస్తుండగా..ప్రేమ్ యాదవ్పై ఓ మహిళ పదునైన ఆయుధంతో దాడి చేసిందని పోలీసులు తెలిపారు. ప్రేమ్ యాదవ్ మృతి గురించి తెలుసుకున్న అతని మద్దతుదారులు.. దూబే ఇంట్లోకి చొరబడి అతనిని, అతని కుటుంబాన్ని హత్య చేశారు. ఈ దాడిలో దూబే కుమారుడు అన్మోల్ గాయపడగా.. చికిత్స నిమిత్తం వైద్య కళాశాలకు తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టుగా చెప్పారు. ఇక, మృతులను ప్రేమ్ యాదవ్ (50), సత్యప్రకాష్ దూబే (54), ఆయన భార్య కిరణ్ దూబే (52), కుమార్తెలు సలోని (18), నందాని (10), కుమారుడు గాంధీ (15)గా గుర్తించారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.