న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారంనాడు స్వర్ణదేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.స్వర్ణ దేవాలయంలో సేవా కార్యక్రమంలో కూడ ఆయన పాల్గొన్నారు. భక్తులు అల్పాహరం తిన్న గిన్నెలను రాహుల్ గాంధీ శుభ్రపర్చారు. రాహుల్ గాంధీ ఇవాళ రాత్రికి అమృత్సర్లోనే ఉంటారు.
రాహుల్ గాంధీ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా అమృత్ సర్ కు చేరుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ ఆథ్యాత్మిక పర్యటనకు ఇబ్బంది కల్గించవద్దని కాంగ్రెస్ పార్టీ పంజాబ్ శాఖ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలను కోరారు.
ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్టుపై కాంగ్రెస్, ఆప్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ అమృత్ సర్ పర్యటన ప్రాధాన్యత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాను గత వారంలో పంజాబ్ పోలీసులు డ్రగ్స్, స్మగ్లింగ్, మనీలాండరింగ్ లో ప్రమేయం ఉందనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు రక్తదాహం ఉందని కాంగ్రెస్ నేత ఆరోపించారు. తనను సీఎం మాన్ అంతమొందించవచ్చని కూడ ఖైరా గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖైరా పై 2015 లో నమోదైన కేసులో తాజా సాక్ష్యం లభ్యం కావడంతో అరెస్ట్ చేసినట్టుగా పంజాబ్ ప్రభుత్వం తెలిపింది.