ఉత్తరప్రదేశ్లో దళితులపై దారుణాలు ఆగడం లేదు. ప్రతి నిత్యం రాష్ట్రంలోని ఏదో మూలన వెనుకబడిన వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు.
ఉత్తరప్రదేశ్లో దళితులపై దారుణాలు ఆగడం లేదు. ప్రతి నిత్యం రాష్ట్రంలోని ఏదో మూలన వెనుకబడిన వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళితుడిని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు మరణించాడు. మృతుడి భార్య గ్రామ్ ప్రధాన్ (సర్పంచ్) కావడం ఇక్కడ ఆశ్చర్యకరం.
వివరాల్లోకి వెళితే... అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందోయియా గ్రామానికి చెందిన అర్జున్ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో గురువారం ఆరుగురు వ్యక్తులు కలిసి అర్జున్ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పు పెట్టారు.
ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సుల్తాన్పూర్ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్కు తరలించారు. కానీ మార్గమధ్యంలోనే అతడు మరణించాడు
అయితే గ్రామ పెద్ద (సర్పంచ్), బాధితుడి భార్య తన ప్రత్యర్థులే ఈ హత్య చేశారని ఆరోపించింది. ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కానీ గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్ కోరిని హత్య చేశారని చెబుతున్నారు. మరోవైపు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంగటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.