ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్‌గా రమణ్‌ సింగ్ .. మూడు సార్లు సీఎంగా చేసి , ఇప్పుడు సరికొత్త పాత్రలోకి

Siva Kodati |  
Published : Dec 19, 2023, 02:33 PM ISTUpdated : Dec 19, 2023, 02:36 PM IST
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ స్పీకర్‌గా రమణ్‌ సింగ్  .. మూడు సార్లు సీఎంగా చేసి , ఇప్పుడు సరికొత్త పాత్రలోకి

సారాంశం

బీజేపీ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛత్తీస్‌గఢ్‌ను వెనుకబడిన రాష్ట్రం అన్న పేరు నుంచి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత రమణ్ సింగ్‌దే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన 15 ఏళ్ల పాలనలో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 

బీజేపీ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ తొలి సెషన్ ఈరోజు రాయపూర్‌లో ప్రారంభమైంది. 71 ఏళ్ల రమణ్ సింగ్ ఆదివారం స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఛత్తీస్‌గఢ్ విధానసభలో అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లడం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లను కైవసం చేసుకోగా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ 35 సీట్లకే పరిమితమైంది. 

మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే .. ప్రొటెం స్పీకర్ రాంవిచార్ నేతమ్.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి.. ప్రతిపక్షనేత చరణ్ దాస్ మహంత్  , ఉప ముఖ్యమంత్రులు అరుణ్ సావో, విజయ్ శర్మ, మాజీ సీఎంలు రమణ్ సింగ్, భూపేష్ బఘేల్‌లు కూడా ప్రమాణం చేసిన వారిలో వున్నారు. శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రమణ్‌సింగ్‌ను స్పీకర్‌గా ఎన్నుకోవాలని సీఎం విష్ణుదేవ్ సాయ్ ప్రతిపాదించగా.. డిప్యూటీ సీఎం సావో దానిని బలపరిచారు. దీనికి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపేష్ బఘేల్ మద్ధతు ఇచ్చారు. 

2008, 2013, 2018, 2023లలో వరుసగా నాలుగు సార్లు రాజ్‌నంద్ గావ్ సీటును గెలుచుకుని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా నిలిచారు రమణ్‌సింగ్‌. 1999లో ఒకసారి ఎంపీగా గెలిచిన ఆయన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల ముగిసిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గిరీష్ దేవాంగన్‌పై ఆయన 45,084 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌ను వెనుకబడిన రాష్ట్రం అన్న పేరు నుంచి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత రమణ్ సింగ్‌దే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన 15 ఏళ్ల పాలనలో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Fake Universities : ఈ విద్యాసంస్థల్లో చేరారో అంతే సంగతి.. ఆంధ్ర ప్రదేశ్ లో ఫేక్ యూనివర్సిటీల కలకలం
Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు