
మహారాష్ట్రలోని సాంగ్లీలో నలుగురు సాధువులను పిల్లలను ఎత్తుకెళ్తే దొంగలుగా భావించి స్థానికులు దారుణంగా కొట్టారు. సరిగ్గా రెండేళ్ల క్రితం పాల్ఘర్లో సాధువులను చంపిన ఘటనలా ఉంది ఈ ఘటన. అయితే సాంగ్లీ విషయంలో పోలీసులు సాధువులను గుంపు నుంచి కాపాడారు. ఈ ఘటన జాట్ తహసీల్లోని లవంగా గ్రామంలో జరిగింది. సాధువులు ఉత్తరప్రదేశ్లోని 'అఖాడా' సభ్యులని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. సాధువులు దేవదర్శనం కోసం యుపిలోని మధుర నుండి కర్ణాటకకు వచ్చారని, అక్కడి నుండి కొంతమంది పంధర్పూర్లో ఓ గుడిలో దర్శనం చేసుకున్నారు. ఆ రాత్రి అక్కడే బస చేశారు.
మరుసటి రోజు ఉదయం.. వారి యాత్రను ప్రారంభించారు. అయితే.. మార్గ మధ్యలో జాట్ తహసీల్లోని లవంగా గ్రామంలో దారి కోసం ఒక పిల్లవాడిని అడిగారు. దీంతో కొందరు స్థానికులు పిల్లలను అపహరించే క్రిమినల్ ముఠానేని అనుమానించారు. వెంటనే గ్రామస్తులు వారిని ఏం ప్రశ్నించకుండా.. కర్రలతో కొట్టడం ప్రారంభించారు. తాము సాధువులమనీ, మధురలోని శ్రీ పంచమనామ జునా అఖారాకు చెందినవారమని చెప్పిన పట్టించుకోలేదు. విచక్షన రహితంగా వారిపై దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. సాధువులను రక్షించారు.
ఈ ఘటనపై పోలీసు అధికారి దీక్షిత్ గెడమ్ మీడియాతో మాట్లాడుతూ.. జాట్ తహసీల్లోని లవంగా గ్రామంలో కొందరు సన్యాసులపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది, మరికొంతమంది నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే అనుమానంతో గ్రామస్తులు పెద్దఎత్తున గుమిగూడి సాధువులను కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇలాంటి సంఘటనే.. ఏప్రిల్ 16, 2020న మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో పిల్లలను దొంగిలించారనే అనుమానంతో ఇద్దరు సాధువులతో వారి డ్రైవర్ ను కూడా దారుణంగా కొట్టారు. వారి దెబ్బలు తట్టుకోలేక అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటనలో దాదాపు 250 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సాధువులిద్దరూ తమ కారులో ముంబై నుంచి సూరత్కు వెళుతుండగా.. పాల్ఘర్లోని గడ్చించ్లే గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాధువులను కొట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ ప్రకటన వెలువడింది. సాధువులతో ఇలా ప్రవర్తిస్తే సహించేది లేదని తెలిపారు.