ఢిల్లీ లిక్కర్ స్కాం .. నాపై పోలీసులు చేయి చేసుకున్నారన్న మనీష్ సిసోడియా, వీడియో సమర్పించాలన్న కోర్ట్

Siva Kodati |  
Published : Jul 19, 2023, 03:58 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం .. నాపై పోలీసులు చేయి చేసుకున్నారన్న మనీష్ సిసోడియా, వీడియో సమర్పించాలన్న కోర్ట్

సారాంశం

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కొద్దిరోజుల క్రితం సిసోడియా విచారణకు హాజరైన సమయంలో జరిగిన గొడవకు సంబంధించి పెన్‌డ్రైవ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సమర్పించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణ నిమిత్తం ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో మనీస్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పోలీసులు చేయి చేసుకున్నారని సిసోడియా ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కొద్దిరోజుల క్రితం సిసోడియా విచారణకు హాజరైన సమయంలో జరిగిన గొడవకు సంబంధించి పెన్‌డ్రైవ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సమర్పించాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ జూలై 25కు వాయిదా వేసింది. 

విచారణకు ముందు సిసోడియా సహా ఇతర నిందితులకు ఛార్జ్‌షీట్ డిజిటల్ కాపీని హార్డ్ డిస్క్ ద్వారా అందించాలని కోర్ట్ పేర్కొంది. విచారణ సందర్భంగా సిసోడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇందులో ఓ పోలీస్ అధికారి మనీష్ మెడను పట్టుకుని కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తాము సిసోడియాతో దురుసుగా ప్రవర్తించలేదని ఢిల్లీ పోలీసులు చెప్పుకొచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా సిసోడియాను వీలైనంత త్వరగా కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేశామని వారు కోర్టుకు వివరించారు. 

ALso Read: Delhi liquor scam: రూ.52 కోట్ల విలువైన మనీష్ సిసోడియా ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ

ఇదిలావుండగా.. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు వైద్య కారణాలతో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు జూలై 24 వరకు పొడిగించింది. అతడి వైద్య నివేదికలను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సమర్పించాలని జైన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

జైన్ కు శస్త్రచికిత్స చేయాలని మూడు ఆస్పత్రులు సిఫారసు చేశాయని సింఘ్వీ తెలిపారు. వైద్య కారణాల దృష్ట్యా మే 26న జైన్ కు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఒక పౌరుడు తన సొంత ఖర్చులతో ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు నచ్చిన చికిత్స పొందే హక్కు ఉందని పేర్కొంది.

కాగా.. జైన్ తో సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా ఆయన మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తూ.. గత ఏడాది మే 30న జైన్ ను అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో జైన్ సీబీఐ అరెస్టు చేసింది. అయితే సీబీఐ నమోదు చేసిన కేసులో 2019 సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

PREV
click me!

Recommended Stories

Tamil Nadu Heavy Rain: తమిళనాడు లో దంచికొట్టిన వర్షం జలమయమైన రహదారులు | Asianet News Telugu
Madurai Theerthavari Festival: మీనాక్షి అమ్మవారి ఉత్సవం కిక్కిరిసిపోయిన మధురై వీధులు| Asianet Telugu