
RJD Compares New Parliament Building With A Coffin: భారత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన రోజున రాష్ట్రీయ జనతా దళ్ ఈ నిర్మాణం పై షాకింగ్ కామెంట్ చేసింది. ఈ భవనం డిజైన్ ను శవపేటికతో పోల్చడం తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని శవపేటికతో పోల్చింది. కొత్త పార్లమెంటు భవనం శవపేటిక ఆకారంలో ఉందని సూచిస్తూ శవపేటిక ఫోటో పక్కన కొత్త పార్లమెంట్ భవనం ఫొటోను షేర్ చేస్తూ.. 'యే క్యా హై (ఇది ఏమిటి?)' అని ప్రశ్నించింది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై విమర్శలతో పాటు భిన్న స్పందనలు వస్తున్నాయి.
కొత్త పార్లమెంటును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. అనంతరం నాదస్వరం, వేద మంత్రోచ్ఛారణల మధ్య అధికార బదలాయింపు చిహ్నమైన సెంగోల్ ను ఊరేగింపుగా కొత్త పార్లమెంట్ భవనానికి తీసుకెళ్లి లోక్ సభ చాంబర్ లోని స్పీకర్ కుర్చీకి కుడివైపున ఉన్న ప్రత్యేక ఎన్ క్లోజర్ లో ప్రతిష్ఠించారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ సహా 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. ముర్ము కేవలం దేశాధినేత మాత్రమే కాదు, పార్లమెంటులో అంతర్భాగమైనందున కొత్త భవనాన్ని ప్రారంభించాలని ప్రతిపక్షాలు వాదించాయి. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై జార్ఖండ్ ఆర్జేడీ ప్రశ్నించింది. ఆర్జేడీ ప్రధాన అధికార ప్రతినిధి డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతిని పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం సరికాదన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రతిపక్షాల నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తాను చాలా సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాననీ, ప్రస్తుతం ఉన్న భవనం, ఈ నిర్మాణం మంచి స్థితిలో ఉందని అన్నారు. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నట్లు పత్రికల్లో చదివానని శరద్ పవార్ చెప్పారు. ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై మమ్మల్ని సంప్రదించలేదు. నిబంధనల ప్రకారం, భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం మొదటి సమావేశాలను (పార్లమెంటు) ప్రసంగిస్తారు. కాబట్టి రాష్ట్రపతి కొత్త భవనాన్ని ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఎవరినీ కూడా ఈ విషయంలో విశ్వాసంలోకి తీసుకోవడం లేదు కాబట్టి, మేము ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.