ఉత్తరప్రదేశ్లోని మధుర పోలీసులు పలు కేసుల్లో సీజ్ చేసిన 581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని కోర్టుకు తెలిపారు. అందుకు సంబంధించిన ప్రూఫ్ను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: గంజాయి కేసుల్లో దొరికిన మరిజువానాను పోలీసులు సీజ్ చేస్తూ ఉంటారు. అలా సీజ్ చేసిన 581 కిలోల గంజాయి గురించి ఇటీవలే కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. సీజ్ చేసిన గంజాయికి సంబంధించిన రిపోర్టును నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సోకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కోర్టుకు పోలీసులు సమర్పించారు. 581 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.
పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయిపై నివేదిక అందించాలని ఈ కోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు మధురలోని షేర్గాడ్ పోలీసు స్టేషన్, హైవే పోలీసు స్టేషన్లకు చెందిన పోలీసులు రిపోర్టును సబ్మిట్ చేశారు. షేర్గాడ్ పోలీసు స్టేషన్లో 386 కిలోల గంజాయి, హైవే పోలీసు స్టేషన్లో 195 కిలోల గంజాయిని ఉంచారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దాఖలు చేసిన నివేదికలో ఆ గంజాయిని ఎలుకలు తినేశాయని పేర్కొన్నారు. దీనికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జీ అందుకు సంబంధించిన ఎవిడెన్స్ను నవంబర్ 26వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించారు.
Also Read: గంజాయి తోట గుర్తించి పరిశీలించిన పోలీసు.. అధికారిపై దాడి చేసిన 40 మంది గంజాయి సాగుదారులు
హైవే పోలీసు స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ ఛోటే లాల్ దీనిపై మాట్లాడుతూ అక్టోబర్ నెలలో వరదలు వచ్చి గంజాయి నిల్వ చేసిన వేర్ హౌజ్ మునిగిపోయిందని వివరించారు. ఆ వరదలతో గంజాయి పాడైపోయిందని తెలిపారు. షేర్గాడ్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ సోను కుమార్ కూడా ఇంచుమించు ఇదే విధమైన కారణాలు వెల్లడించారు.
ఆ గంజాయి విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.