అత్యాచారం చేసిన వ్యక్తితో బాధితురాలు పెళ్లి.. వాళ్లకు ఓ బిడ్డ.. కేసు కొట్టేయాలంటూ కోర్టుకు వెళితే..

By team teluguFirst Published Nov 25, 2021, 5:08 PM IST
Highlights

ఓ వ్యక్తి తాను అత్యాచారం చేసిన అమ్మాయినే పెళ్లి (Rape accused marries survivor) చేసుకున్నాడు. వాళ్లకు ఒక్క బిడ్డ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అత్యాచార కేసును కొట్టివేయాలని హైకోర్టును (High Court) ఆశ్రయించారు. 

ఓ వ్యక్తి తాను అత్యాచారం చేసిన అమ్మాయినే పెళ్లి (Rape accused marries survivor) చేసుకున్నాడు. వాళ్లకు ఒక్క బిడ్డ కూడా ఉంది. ఈ క్రమంలోనే నిందితుడు, బాధితురాలు కలిసి అత్యాచార కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం నిందితుడిపై ఉన్న కేసును రద్దు చేసేందుకు నిరాకరించింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక విజయపుర జిల్లా బాసవానా బాగెవాడీలోని ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతున్న ఓ అత్యాచార కేసును కొట్టేయాలని బాధితురాలు, నిందితుడు కర్ణాటక హైకోర్టుకు చెందిన కలబురిగి బెంచ్​ను (Kalaburagi bench of High Court) ఆశ్రయించారు. 

తమకు ఇప్పుడు పెళ్లయిందని, బిడ్డ కూడా ఉన్నారని వారు కోర్టుకు తెలిపారు.  ఈ కేసులో నిందితుడిపై న్యాయ విచారణ కొనసాగిస్తే ఎలాంటి ప్రయోజనం లేదని బాధితురాలు (rape victim) తన పిటిషన్​లో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిన సమయంలో తన వయసు 19 ఏళ్లు అని బాధితురాలు తెలిపింది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన జస్టిస్​ హెచ్‌పీ సందేశ్​(Justice HP Sandesh) నేతృత్వంలోని ధర్మాసనం .. బాధితురాలి అభ్యర్థనను తిరస్కరించింది. నేర స్వభావం, తీవ్రత, సామాజిక ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని కేసును రద్దు చేయడం లేదని పేర్కొంది.

అత్యాచారం జరిగిన సమయంలో బాలిక మైనరా..? కాదా..? అనే విషయాన్ని ట్రయల్ కోర్టులో (trial court) నిర్దారించాల్సి ఉంటుందని జస్టిస్ సందేశ్ తెలిపారు. ఒక వేళ నిందితుడు బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారం చేసి ఉంటే  ఐపీసీ 376 (అత్యాచారం)  సెక్షన్ కింద శిక్ష నుంచి తప్పించుకోలేడని అన్నారు. బాధితురాలితో రాజీ కుదుర్చుకున్నప్పటీకీ శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. సీఆర్​పీసీ సెక్షన్ 482 కింద ఓ కేసును రద్దు చేసే ముందు నేర స్వభావం, తీవ్రతను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును జస్టిస్ సందేశ్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు సమాజంపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. నిందితుడిపై కేసును రద్దు చేసేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు అక్టోబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారు. 

click me!