
బంగాళాఖాతం నుంచి వీస్తున్న బలమైన నైరుతి గాలుల వల్ల పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావం వల్ల నేటి నుంచి వాయువ్య, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో రానున్న నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పశ్చిమ హిమాలయ ప్రాంతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న మైదానాలలో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని IMD చెప్పింది. రానున్న నాలుగు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఏప్రిల్ 23 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD ప్రకారం.. రాబోయే ఐదు రోజులలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కర్ణాటకలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోకూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
వచ్చే రెండు రోజుల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు, తూర్పు ఉత్తరప్రదేశ్లో రేపు, ఎళ్లుండి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.