
Amar Jawan Jyoti: ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో నిర్మించనున్న ‘అమర్ జవాన్ జ్యోతి’కి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శంకుస్థాపన చేస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించారు. రాయ్పూర్లోని ఛత్తీస్గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించనున్నారు. ఇందుకోసం .. ఫిబ్రవరి 3న ఆయన స్మారక చిహ్నం కోసం 'భూమి పూజ' నిర్వహించనున్నారు.
ఇందిరా గాంధీ హయాంలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన అమర జవాన్ జ్యోతిని ఈ మధ్యే జాతీయ యుద్ధ స్మారకంలో మోదీ ప్రభుత్వం విలీనం చేయడాన్ని కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని బాఘేల్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రాహుల్ గాంధీ ఫిబ్రవరి 3న ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. భూమిలేని కూలీల కోసం 'రాజీవ్ గాంధీ భూమిహిన్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన' పేరుతో ఆర్థిక సహాయ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ విషయమై బాఘేల్ మాట్లాడుతూ.. రాయ్పూర్లోని ఛత్తీస్గఢ్ సైనిక బలగాల 4వ బెటాలియన్ పరిసర ప్రాంతంలో అమర జవాన్ జ్యోతిని నిర్మించనున్నట్లు తెలిపారు. అమర సైనికులకు నివాళిగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ జ్యోతి నిర్మాణానికి రాహుల్ గాంధీ గురువారం భూమి పూజ చేస్తారనీ, ఈ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందనీ, త్యాగాల విలువ పార్టీకి బాగా తెలుసుననీ తెలిపారు. అమర సైనికుల త్యాగాలను, కృషిని విస్మరిస్తే సమాజం విధ్వంసం అవుతుందని అన్నారు.
1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణా త్యాగం చేసిన భారత సైనికుల స్మారక చిహ్నంగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జనవరి 26, 1972న అమర్ జవాన్ జ్యోతిని నిర్మించారని గుర్తు చేశారు. ఈ అమర జ్యోతి నిత్యం వెలుగుతూ కనిపించేది. కానీ, ఆ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేశారు. ఈ చర్య తమకు అసంతృప్తిని కలిగించిందనీ, అందుకే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఛత్తీస్గఢ్లోని అమరవీరుల జ్ణాపకార్థం రాయ్పూర్లో అమర జవాన్ జ్యోతిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనిఅన్నారు.
"మన వీర జవాన్ల త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన అమర జ్వాల వీలినం చేయడం చాలా బాధాకరం. కొందరు దేశభక్తిని, త్యాగాన్ని అర్థం చేసుకోలేరు, పర్వాలేదు. మరోసారి మన సైనికులకు కోసం 'అమర్ జవాన్ జ్యోతి'ని వెలిగిస్తాం." రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.