
Rahul Gandhi: కాశ్మీరీ పండిత్ కమ్యూనిటీకి చెందిన రాహుల్ భట్ హత్యకు వ్యతిరేకంగా శుక్రవారం కాశ్మీర్ లోయలో నిరసనలు వెల్లువెత్తాయి. తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. కాశ్మీరీ పండిట్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాశ్మీరీ పండిట్ల మారణహోమం గురించి మాట్లాడటం కంటే సినిమా గురించి మాట్లాడటం తనకు ముఖ్యమని ఆరోపించారు.
2010-11లో వలసదారుల కోసం ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద క్లర్క్ ఉద్యోగం పొందిన రాహుల్ భట్ను గురువారం సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలోని చదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. హత్యకు గురైన ప్రభుత్వ అధికారి భార్య వీడియో ట్వీట్ ను రాహుల్ గాంధీ ట్యాగ్ చేస్తూ.. భద్రతకు బాధ్యత వహించాలని, కాశ్మీర్లో శాంతిని నెలకొల్పాలని గాంధీ ప్రధానిని కోరారు. కాశ్మీరీ పండిట్ల మారణహోమం కంటే ప్రధానమంత్రి సినిమాపై మాట్లాడటం చాలా ముఖ్యమని, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి స్పష్టంగా ప్రస్తావించారు. బీజేపీ విధానాల వల్లే నేడు కాశ్మీర్లో ఉగ్రవాదం తారాస్థాయికి చేరుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై అంతర్గ చర్చలు జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం డిమాండ్ చేయగా, ఒకరోజు ముందుగానే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్(Rahul Gandhi) అధ్యక్షుడిగా ఉండాలనే డిమాండ్ చాలా కాలంగా ఉందని ఆయన అన్నారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికపై చాలా మంది పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది
ఉదయ్పూర్లో జరుగుతున్న చింతన్ శివర్లో హాజరైన నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. పార్టీని నడపడానికి డబ్బులు లేవని అంటున్నారు. కార్పొరేట్ సంస్థలు నిధులు ఇవ్వవు. పార్టీ కార్యక్రమాలకు డబ్బులు లేవు. శిబిరంలో చాలా ముఖ్యమైన అంశాలపై చర్చ జరగడం లేదని అంటున్నారు. పార్టీ అధ్యక్షుడి విషయంలోనూ స్పష్టత రావడం లేదు. అధ్యక్షుడి విషయంలో నేతల మధ్య భిన్నా భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని వాపోతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోలేక నష్టం వాటిల్లిందని ప్రతినిధులు భావిస్తున్నారు. పొలిటికల్ కమిటీలో పాల్గొన్న ఆచార్య ప్రమోద్ కృష్ణన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి ఇష్టం లేదని, ప్రియాంక గాంధీని అధ్యక్షురాలిని చేయండని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుత పార్టీ ఉన్న స్థితిలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక తప్పదని కొందరు నేతలు భావిస్తున్నారు. యుపి-బీహార్ రాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత .. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని స్వంత పార్టీ నేతలే భావిస్తున్నట్టు టాక్.
ఆర్ఎస్ఎస్కు పోటీగా ఓ సామాజిక సంస్థను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా ప్రజల ఇంటింటికి కాంగ్రెస్ చేరి ప్రజాసేవకు దిగిందని శిబిరంలో పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్కు కాలేజీలు, ఆసుపత్రులు, అన్నీ ఉన్నాయని, కాంగ్రెస్కు కార్యాలయాలు కూడా లేవని ప్రతినిధులు అంటున్నారు.