
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు తొలగిపోవడంతో ఆయన తిరిగి లోక్సభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలకు సంబంధించిన క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించగా.. ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్దరిస్తూ లోక్సభ సెక్రటేరియేట్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు తాజాగా ప్రభుత్వ బంగ్లాను కేటాయింపుకు లోక్సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో ఎంపీగా అనర్హత వేటు పడటంతో రాహుల్ ఖాళీ చేసిన 12 తుగ్లక్ లేన్లోని బంగ్లాను తిరిగి ఆయనకు లోక్సభ హౌస్ కమిటీ కేటాయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కథనాలపై రాహుల్ గాంధీని ప్రశ్నించినప్పుడు.. ‘‘మేరా ఘర్ పూరా హిందుస్థాన్ హై’’ అని సమాధానమిచ్చారు.
ఇక, రాహుల్ గాంధీపై ఈ ఏడాది మార్చిలో ఎంపీగా అనర్హత వేటు పడగా.. ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా కోరారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఏప్రిల్లో ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్లోని తన అధికారిక నివాసాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఖాళీ చేశారు. అయితే తాజాగా ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్దరించిన నేపథ్యంలో ఆయనకు తిరిగి గతంలో నివాసం ఉన్న ఇంటినే కేటాయించాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి లోక్సభ హౌసింగ్ కమిటీకి లేఖ రాశారు.
అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అయితే కర్ణాటకలోని కోలార్లో 2019 ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఆయనపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే ఆయన లోక్సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే ఆయన తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది.
మరోవైపు రాహుల్ గాంధీ తన నేరారోపణను నిలిపివేయాలనే అభ్యర్థనతో పాటు సెషన్స్ కోర్టులో ఆ ఉత్తర్వులను సవాలు చేశారు. సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న అతనికి బెయిల్ మంజూరు చేసింది. అతని సవాలును వినడానికి అంగీకరించింది. అయితే ఆ తర్వాత నేరారోపణపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేసేందుకు సెషన్ కోర్టు నిరాకరించడాన్ని సమర్థిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ జూలై 15న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై సుప్రీం కోర్టు శుక్రవారం (ఆగస్టు 4) స్టే విధించింది. సూరత్ కోర్టులోని ట్రయల్ జడ్జి రెండేళ్ల గరిష్ట శిక్ష విధించడానికి తగిన కారణాలను అందించలేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.ట్రయల్ జడ్జి ఈ కేసులో గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షను విధించారని.. శిక్ష ఒక రోజు తక్కువగా ఉంటే ఎంపీగా అనర్హత వేటు పడి ఉండేది కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక, ఈ వార్త తెలియగానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు, సోనియా గాంధీ నివాసం వెలుపల సంబరాలు జరిగాయి.