
పంజాబ్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎర్లీ ట్రెండ్స్ను చూస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాంగ్రెస్ కీలక నేతలు సైతం చాలా చోట్ల వెనకంజలో ఉన్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల ఇతర పార్టీలకు చెందిన హేమాహేమీలను వెనక్కి నెడుతూ ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కూడా వెనకంజలో ఉన్నారు. మోగా స్థానం నుంచి బరిలో నిలిచిన మాళవిక తన ప్రత్యర్థి కంటే వెనకంజలో ఉన్నారు.
ఇక, గత 40 ఏళ్లుగా మోగా స్థానంలో కాంగ్రెస్దే ఆధిపత్యం. 1977 నుంచి 2017 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి ఆరుసార్లు విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో హర్జోత్ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాళవిక కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కొనసాగిస్తుంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. ఆప్ భారీ మెజారిటీ వైపుగా దూసుకుపోతుంది. మూడింట రెండో వంతు స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి పంజాబ్లో ఆప్ సత్తా చాటుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో.. ఆప్ 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 16 స్థానాల మాత్రమే ముందజలో ఉంది. చాలాచోట్ల అధికారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆప్ గట్టి షాక్ ఇస్తుంది. కాంగ్రెస్తో పాటు, ఇతర పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలను వెనక్కి నెడుతూ ఆప్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఎర్లీ ట్రెండ్స్ చూస్తే పంజాబ్లో ఆప్ అధికారం చేపట్టడం లాంచనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పంజాబ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీలో అంతర్గతంగా చోటుచేసుకన్న పరిణామాలు.. తీవ్ర నష్టాన్నే మిగిల్చిందని చెబుతున్నారు. ఇక, ఆప్ విజయం దిశగా దూసుకుపోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక, పంజాబ్ విషయానికి వస్తే ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఫపోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది.
పంజాబ్లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లలో, ఆప్ 20 చోట్ల గెలిచింది. ఎస్ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, బాదల్ నేతృత్వంలోని ఎస్ఏడీ (సంయుక్త)తో కలిసి బరిలోకి దిగింది.