కోల్‌కతా ఓటర్‌గా నమోదు చేసుకున్న ప్రశాంత్ కిశోర్.. ఎందుకో తెలుసా?

By telugu teamFirst Published Sep 26, 2021, 9:36 AM IST
Highlights

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ తనను కోల్‌కతా ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నారు. టీఎంసీని ఎలాగైనా గెలిపించాలనే లక్ష్యంతో ముందుకు సాగిన ఆయన వ్యూహంలో భాగంగానే ఇక్కడ ఓటర్‌గా నమోదు చేసుకున్నారు.

కోల్‌కతా: రాజకీయ వ్యూహకర్త(Political Strategist) ప్రశాంత్ కిశోర్(Prashant kishor) వేసే ప్రతి అడుగు వెనుక ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. తనను నమ్ముకున్న పార్టీలను గట్టెక్కించి విజయతీరాలకు తెచ్చే ఆయన ఆచితూచి అడుగువేస్తుంటాడు. తాజాగా ఆయన కోల్‌కతా(Kolkata)లో ఓటు హక్కును రిజిస్టర్ చేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా  బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గ ఉపఎన్నిక నుంచి స్వయంగా పోటీ చేయనున్న తరుణంలో ఈ విషయం వెల్లడైంది. ఆయన కోల్‌కతా ఓటర్‌గా నమోదు కావడానికి గల కారణాలు ఏమై ఉంటాయనే ఆసక్తి అంతటా వెలికి వస్తున్నది.

తొలుత ఆయన బిహార్ ససారామ్ జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటర్‌గా ఉన్నారు. కానీ, తర్వాత ఆయన కోల్‌కతా ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిసింది. ఇది ఇప్పుడు కాదు.. అసెంబ్లీ ఎన్నికల(Assembly Election)కు ముందే ఆయన ఈ పనిచేశాడు. ఇందుకు గల కారణాలు ఆయన లక్ష్యాన్ని చేరడమేనని తెలుస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎప్పటికప్పుడు వ్యూహాలు అందిస్తూ వెన్నతట్టి ఉండటానికి అనువుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. సుదీర్ఘంగా జరిగిన ఈ ఎన్నికల కాలంలో పార్టీ చెంతన ఉండటానికే ఆయన కోల్‌కతా ఓటర్‌గా రిజిస్టర్ చేసుకున్నట్టు తెలిసింది. 

ఎన్నికల సమయంలో ఎల్లకాలం కోల్‌కతాలోనే కొనసాగితే ప్రత్యర్థపార్టీ బీజేపీ ఎన్నికల కమిషన్ ముందు అభ్యంతరాలు లేవనెత్తే అవకాశముంది. కోల్‌కతాలో ఎక్కువ కాలం క్యాంపెయినర్‌గా ఉంటే ఏడుదశల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండగా ఆయన ఎలా ఇంతకాలం కోల్‌కతాలో కొనసాగగలరని బీజేపీ ఎన్నికల కమిషన్‌ను అడిగే అవకాశముంది. అందుకే వ్యూహాత్మకంగా ఆయన కోల్‌కతా సౌత్ లోక్‌సభ నియోజకవర్గ వోటర్‌గా నమోదుచేసుకున్నారు.

click me!