ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ తో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 2026 వరకు కాంట్రాక్టును కుదుర్చుకుంది. దీని వెనక దీదీ పెద్ద ప్లాన్ ఉన్నట్లు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెసు 2026 వరకు ఐ పాక్ లేదా పొలిటికల్ యాక్షన్ కమిటీతో 2026 వరకు కాంట్రాక్టును కుదుర్చుకుంది. ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐ- పాక్ వరుసగా మూడోసారి తృణమూల్ కాంగ్రెసు విజయం సాధించి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి కావడానికి పనిచేసింది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాత్రం రోజువారీ వ్యవహారాలను పర్యవేక్షించబోరని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ విజయం సాధించడానికి ఆయన ప్రత్యక్షంగా పనిచేశారు. ఆయన ప్రత్యక్ష జోక్యం లేకుండా రోజువారీ కార్యాచరణలో పాల్గొనకుండా ఐ- పాక్ 9 మంది సభ్యుల జట్టు ఏ మేరకు సమర్థంగా పనిచేస్తోందనేది భవిష్యత్తు తేల్చాల్సిందే.
కొత్త కాంట్రాక్టు ప్రకారం ఐ - పాక్ ఒప్పందం మేరకు వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహరచనలు చేసి ముందుకు సాగాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లో వచ్చే శాసనసభ ఎన్నికల వరకు కూడా కాంట్రాక్టు అమలులో ఉంటుంది.
అంతేకాకుండా ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల ఎన్నికలు మాత్రమే కాకుండా లోకసభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఐ ప్యాక్ తమ పార్టీకి పనిచేస్తుందని టీఎంసీ కొత్త ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ ప్రశాంత్ కిశోర్ తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనక ఉన్నాడు.
ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ కావడం కూడా కాంట్రాక్టులో భాగమేనని అంటున్నిారు. 2024 ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని తెర మీదికి తేవడానికి ఆ భేటీ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. మమతా బెనర్జీ బిజెపి, దాని మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ ముందుకు రావడానికి అవసరమైన వ్యూహరచన సాగుతున్నట్లు చెబుతున్నారు.