మహిళా సశక్తీకరణపై మోడీ: త్వరలో కనీస వివాహ వయసు పెంపు?

By team teluguFirst Published Aug 15, 2020, 10:18 AM IST
Highlights

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని  ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారిత అంశాన్ని నొక్కి వక్కాణించారు. 

74వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట మీద జెండా ఎగురవేసి భారతీయులందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికారిత అంశాన్ని నొక్కి వక్కాణించారు. 

మహిళల కనీస వివాహ వయస్సు నిర్ధారణ అంశంలో కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించినట్లు ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. 

కనీస వివాహ వయస్సు పెంపుపై అధ్యయనం చేయడంతోపాటుగా.... కిశోర బాలికల్లో పౌష్టికాహార లోపాన్ని ఎలా అధిగమించాలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ కమిటీ అధ్యయనం చేస్తోందని ప్రధాని ప్రకటించారు. 

భారతీయ సైనికులు భారతీయ సరిహద్దులను కాచి కాపాడుతున్నారని, ఎల్ఓసి నుంచి ఎల్ఏసి వరకు ఎవరు వేలెత్తి చూపినా మన సైనికులు వారి భాషలోనే వారికి సమాధానం చెబుతారని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా సైనికులందరికీ భారతీయులందరి తరుఫున ప్రణామం చేస్తున్నానని ప్రధాని అన్నారు. 

కరోనా వాక్సిన్ గురించి మాట్లాడుతూ... భారతదేశంలో మూడు వాక్సిన్లు వివిధ టెస్టింగ్ దశల్లో ఉన్నాయని, శాస్త్రవేత్తలు పచ్చ జెండా ఊపిన వెంటనే సాధ్యమైనంత తక్కువ సమయంలో భారతీయులందరికి చేరేట్టు ప్రభుత్వం చేస్తుందని అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి ప్లాన్ రెడీగా ఉందన్నారు. 

భారతీయ మధ్యతరగతి వర్గం కోసం తీసుకున్న అనేకమైన నిర్ణయాల గురించి ప్రస్తావిస్తూ.... వారిలో పొటెన్షియల్ ఉందని, నూతన అవకాశాల కోసం వారు వెదుకుతున్నారని, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే సత్త వారికి ఉందని అన్నారు. 

వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదం కావాలని మోడీ అన్నారు. ఇలా గనుక అనకపోతే... మన దేశీయ వస్తువులకు డిమాండ్ ఉండదని ప్రధాని అన్నారు. దేశీయ ఉత్పత్తుల తయారీదారులకు మనము ప్రోత్సాహకం అందించాలంటే... వోకల్ ఫర్ లోకల్ అవ్వడమొక్కటే మార్గమని అన్నారు. 

భారతదేశం ఎన్ని సంవత్సరాలు ముడి సరుకులను ప్రపంచానికి ఎగుమతి చేస్తుందని, భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఫినిష్డ్ గూడ్స్ ఎగుమతి చేయాల్సిన సమయం ఆసన్నమయిందని,  ఆత్మా నిర్భర్ భారత్ ద్వారా దేశం తనకు అవసరమైనవన్నీ తయారు చేసుకోవడంతోపాటుగా... మేక్ ఇన్ ఇండియా.... మేక్ ఫర్ వరల్డ్ అనే విధంగా రూపాంతరం చెందాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారానే మనం ఈ కరోనా వేళ పీపీఈ కిట్లను, ఎన్ 95 మాస్కులను, ఇతర వైద్య సామాగ్రిని భారతదేశంలో తాయారు చేసుకోగలిగామని, అది ఆత్మనిర్భర్ భారత్ వల్ల మాత్రమే సాధ్యమైందని, అది భారతీయుల శక్తి అని మోడీ అన్నారు. 

click me!