జీ20 సదస్సు కోసం నేడు ఇండోనేషియాకు ప్రధాని మోదీ.. ఆ అంశాల గురించి ప్రస్తావించనున్నట్టుగా వెల్లడి..

Published : Nov 14, 2022, 10:11 AM IST
 జీ20 సదస్సు కోసం నేడు ఇండోనేషియాకు ప్రధాని మోదీ.. ఆ అంశాల గురించి ప్రస్తావించనున్నట్టుగా వెల్లడి..

సారాంశం

ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సుకు వేదిక సిద్ధమైంది. ఇండోనేషియా అధ్యక్షతన జరగనున్న 17వ జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు తాను నవంబర్ 14 నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిని సందర్శించనున్నట్టుగా భారత ప్రధాని మోదీ చెప్పారు. 

ఇండోనేషియాలోని బాలిలో జీ-20 సదస్సుకు వేదిక సిద్ధమైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం, జనాభాలో మూడింట రెండొంతుల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 20 దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇవ్వనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఇండోనేషియాలోని బాలికి వెళ్లనున్నారు. బాలి బయలుదేరే  ముందు ప్రధాని మోదీ దేశ ప్రజలకు తన సందేశాన్ని అందజేశారు. ఇండోనేషియా అధ్యక్షతన జరగనున్న 17వ జీ20 లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు తాను నవంబర్ 14 నుంచి 16 వరకు ఇండోనేషియాలోని బాలిని సందర్శించనున్నట్టుగా చెప్పారు. 

ఈ సమ్మిట్ సందర్భంగా.. ప్రపంచ వృద్ధిని పునరుద్ధరించడం, ఆహారం, ఇంధన భద్రత, పర్యావరణం, ఆరోగ్యం, డిజిటల్ పరివర్తన వంటి ప్రపంచ ఆందోళనకు సంబంధించిన కీలక అంశాలపై తాను ఇతర జీ20 నాయకులతో విస్తృత చర్చలు చేయనున్నట్టగా చెప్పారు. జీ20 సమ్మిట్ సమావేశంలో పాల్గొనే అనేక ఇతర దేశాల నాయకులతో సమావేశం కానున్నట్టుగా తెలిపారు. వారితో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించనున్నట్టుగా పేర్కొన్నారు. నవంబర్ 15 న రిసెప్షన్‌లో బాలిలోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. 

‘‘ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో బాలి సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో భారతదేశానికి జీ20 ప్రెసిడెన్సీని అందజేయనున్నారు. ఇది దేశానికి, పౌరులకు ముఖ్యమైన క్షణం. 2022 డిసెంబర్ 1 నుంచి భారతదేశం అధికారికంగా జీ20 ప్రెసిడెన్సీని స్వీకరిస్తుంది. వచ్చే ఏడాది మన దేశంలో జరిగే G20 సమ్మిట్‌కు సభ్యులు, ఇతర ఆహ్వానితులకు కూడా నేను నా వ్యక్తిగత ఆహ్వానాన్ని అందిస్తాను’’ అని మోదీ పేర్కొన్నారు. 

‘‘G20 సమ్మిట్‌లో నేను భారతదేశం సాధించిన విజయాలను, ప్రపంచ సవాళ్లను సమిష్టిగా పరిష్కరించడంలో మా అచంచలమైన నిబద్ధతను ప్రస్తావించనున్నాను. భారతదేశం G20 ప్రెసిడెన్సీ "వసుధైవ కుటుంబం" లేదా "ఒక భూమి.. ఒక కుటుంబం.. ఒక భవిష్యత్తు" అనే థీమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది సమానమైన వృద్ధి, అందరికీ భవిష్యత్తును పంచుకునే సందేశాన్ని నొక్కి చెబుతుంది’’ అని మోదీ తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | CM Vijay Powerful Speech in Tamil Nadu Assembly
ఉచితంగా బంగారం.. సీఎం విజయ్ బర్త్ డే గిఫ్ట్ | Tamil Nadu CM Vijay Birthday Special Gold Rings Gifted