
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే ప్లాంట్లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించడంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన ఆలోచనలన్నీ... ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతోనే ఉన్నాయని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
నిర్మాణంలో ఉన్న ఎస్ఈజెడ్- 3 భవనంలోని నాలుగు, ఐదో అంతస్తుల్లో మంటలు చెలరేగడంతో పొగలు అలముకున్నాయి. దీంతో పలువురు ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు రెండు గంటల పాటు సహాయక బృందాలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు.
ఈ ఘటనపై సీరమ్ అధినేత అదర్ పూనావాలా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడే కొన్ని బాధను కలిగించే సమాచారం అందింది.
అగ్నిప్రమాద ఘటనలో దురదృష్టవశాత్తు కొంత ప్రాణనష్టం జరిగినట్టు తెలిసింది. దీనిపై చాలా బాధపడుతున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం’’ అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
కరోనా నివారణలో భాగంగా ఆక్స్ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన భవనం.. కొవిషీల్డ్ టీకాలు తయారవుతున్న భవనానికి దూరంగా ఉంది. దీంతో వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి.