
Fact Check: సోషల్ మీడియాలో భారత ఆర్మీకి చెందిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ వీడియోలో.. పాకిస్తాన్తో యుద్ధంలో ఇండియా ఆరు ఫైటర్ జెట్లు, 250 మంది సైనికులను కోల్పోయిందని ఒప్పుకున్నట్లుగా ఉంది. కెమెరా ముందు నేరుగా మాట్లాడుతున్నట్లు ఆర్మీ చీఫ్ కనిపిస్తున్నారు. అయితే, ఫ్యాక్ట్ చెక్ లో ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని గుర్తించారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB ఫ్యాక్ట్ చెక్) యూనిట్ ఈ క్లిప్ AI ద్వారా సృష్టించారనీ, జనరల్ ఉపేంద్ర ద్వివేది అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని కన్ఫర్మ్ చేసింది. ఆరు ఎయిర్క్రాఫ్ట్ లేదా 250 మంది సిబ్బంది నష్టం గురించి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. డీప్ఫేక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోను డిజిటల్గా మార్చారు. నమ్మకమైన మీడియా లేదా అధికారిక డిఫెన్స్ కమ్యూనికేషన్ కూడా ఇలాంటి నష్టాలను రిపోర్ట్ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది.
డీప్ ఫేక్ బారిన ఇప్పటికే చాలా మంది పడ్డారు. ముఖ్యంగా జాతీయ భద్రత వంటి సున్నితమైన అంశాల చుట్టూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి డీప్ఫేక్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అనవసర భయాందోళనలకు దారితీయవచ్చు.
ఇలాంటి సంచలనాత్మక వార్తలను ఆన్లైన్లో షేర్ చేసే ముందు అధికారిక ఛానెల్స్ ద్వారా వెరిఫై చేసుకోవాలని PIB ఫ్యాక్ట్ చెక్ టీమ్ పౌరులను కోరింది. ఉద్దేశపూర్వకంగా లేదా అనుకోకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు.