జమ్ముకశ్మీర్‌లో ఆ 3 కుటుంబాల దందా ఇక బందే: అమిత్ షా వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 24, 2021, 5:36 PM IST
Highlights

జమ్ము కశ్మీర్‌ను 3 కుటుంబాలు భ్రష్టుపట్టించాయని అమిత్ షా మండిపడ్డారు. ఆ మూడు కుటుంబాలు 70 ఏళ్ల పాటు జమ్ము కశ్మీర్‌కు ఏం ఇచ్చాయని హోంమంత్రి ప్రశ్నించారు. కానీ ఆ 3 కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయని, ఆ మూడు కుటుంబాల నుంచి ఆరుగురు ఎంపీలు, 87 మంది ఎమ్మెల్యేలు అయ్యారని అమిత్ షా వివరించారు.

బీజేపీ (bjp) అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (amit shah) జమ్మూ కశ్మీర్‌లో (jammu kashmir) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం జమ్ములోని డిజియానాలో గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, జమ్ము కశ్మీర్‌ను 3 కుటుంబాలు భ్రష్టుపట్టించాయని మండిపడ్డారు. ఆ మూడు కుటుంబాలు 70 ఏళ్ల పాటు జమ్ము కశ్మీర్‌కు ఏం ఇచ్చాయని హోంమంత్రి ప్రశ్నించారు. కానీ ఆ 3 కుటుంబాలు మాత్రం బాగుపడ్డాయని, ఆ మూడు కుటుంబాల నుంచి ఆరుగురు ఎంపీలు, 87 మంది ఎమ్మెల్యేలు అయ్యారని అమిత్ షా వివరించారు.

మోడీ (narendra modi) ప్రధాని అయ్యాక జమ్ము కశ్మీర్‌లో గ్రామస్వరాజ్యం తెచ్చారని ఆయన కొనియాడారు. ఇప్పుడు జమ్ము కశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో పంచాయతీ పాలన జరుగుతోందని అమిత్ షా వెల్లడించారు. జమ్ము కశ్మీర్‌లో గ్రామ ప్రతినిధులుగా 30 వేల మంది ఎన్నికయ్యారని వివరించారు. ఇకపై ఆ మూడు కుటుంబాల దాదాగిరీ జమ్ము కశ్మీర్ లో పనిచేయదని ఆయన హెచ్చరించారు. 

Also Read:జమ్ము కశ్మీర్‌ ఎన్నికలు, రాష్ట్రహోదాపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

కాగా.. అమిత్ షా మూడు రోజుల పర్యటన నిమిత్తం జమ్ము కశ్మీర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఉదయం ఆయన జమ్ము కశ్మీర్ చేరుకున్నారు. అనంతరం ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఓ పోలీసు అధికారి  కుటుంబాన్ని పరామర్శించారు. జమ్ము కశ్మీర్‌లో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదంపై భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం జమ్ము కశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్రహోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణం 370 రద్దు (article 370) చేసిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ లేదా లోక్ సభ నియోజకవర్గాలకు సరిహద్దులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా డీలిమిటేషన్ (delimitation) ప్రక్రియను వేగంగా చేపట్టాలని యోచించింది. ఇందుకోసం సంబంధిత అధికారులకూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. కానీ, జమ్ము కశ్మీర్‌లోని పార్టీలు ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నాయి. ముందు రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని పేర్కొన్నాయి. తాజాగా, అమిత్ షా ఈ అంశంపై మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియను ఎందుకు ఆపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడిగారు. దీన్ని ఎవరూ ఆపడం లేదని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని ఓ యూత్ క్లబ్ సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

click me!