జూన్ 28న ఢిల్లీ-భోపాల్ మధ్య నడుస్తున్న భోపాల్ శతాబ్ది రైలులో ఓ ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురయ్యింది. ఒక కప్పు టీకి రూ.70 వసూలు చేశారు.
భోపాల్ : రైలు ప్రయాణంలో ఓ ప్రయాణికుడు కప్పు టీ ఆర్డర్ ఇచ్చాడు. బిల్లు చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఒక కప్పు టీకి రూ.70 వసూలు చేశారు. ఇంకా ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే.. రూ.20 టీకి.. రూ.50లు సర్వీస్ ఛార్జ్ వసూలు చేశారు. రైల్వే అధికారుల ఈ హైఫై సర్వీస్ కు ఖంగు తిన్న ఆ ప్రయాణికుడు.. ఆ బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే రైల్వే అధికారులు దీనికి క్లారిఫికేషన్ ఇచ్చారు.
భారతీయ రైల్వేలో ఆహారం, పానీయాలు సబ్సిడీ ధరలకు లభిస్తాయని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ఇటీవల ఓ ప్రయాణికుడికి జరిగిన అనుభవం తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. తలనొప్పిగా ఉందనో, చికాకుగా ఉందనో రైలు ప్రయాణంలో ఒక కప్పు టీ తాగాలనుకున్నారనుకోండీ.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే.. ఆ ఛాయ్ కు రూ. 70 చెల్లించాల్సి వస్తే.. మీరు రైలులో ఉన్నారో.. ఫైవ్ స్టార్ హోటల్ లో ఉన్నారో అర్థం కాక జుట్టు పీక్కుంటారు. ఇది నిజమా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే.. వాస్తవంగా జరిగిందే.
ఒక ప్రయాణికుడు రైలులో టీ కొన్నాడు. అతను కప్పు టీకి రూ.20 ధర, రూ. 50 సర్వీస్ ఛార్జీగా వసూలు చేశారు. రైల్వే తనకు అందించిన ఈ హై-ఫై సేవకు రుజువుగా, ఆ వ్యక్తి ఆ టీ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది ఇప్పుడు వైరల్గా మారింది. ఇది రైల్వే అధికారులకు తెలియడంతో దీనికి అయితే గల కారణాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ప్రయాణికుడు జూన్ 28న ఢిల్లీ-భోపాల్ మధ్య నడుస్తున్న భోపాల్ శతాబ్ది రైలులో ప్రయాణించిన నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక్కో టీ కి సంబంధించిన రెండు పన్ను ఇన్వాయిస్లను ఒక పోస్ట్ లో షేర్ చేశాడు. ఇది నెటిజన్లను ఉలిక్కిపడేలా చేసింది. "రూ. 20 విలువ చేసే టీపై రూ. 50 జీఎస్టీ. మొత్తంగా, ఒక టీ విలువ రూ. 70. ఇది అద్భుతమైన దోపిడీ కాదా?" అని కామెంట్ చేశారు.
రైల్వేలో క్యాటరింగ్ సేవలను అందించే IRCTCపై ఇలాంటి అనేక ఫిర్యాదులు గతంలోనూ పదే పదే వచ్చాయి. అయితే ఫిర్యాదులు చెత్తబుట్టలోకి చేరాయి. అయితే చాలమంది సోషల్ మీడియా యూజర్లు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అది జీఎస్టీ కాదని.. సర్వీస్ చార్జ్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. మరికొందరు మాత్రం కప్పు టీకి రూ.50 సర్వీస్ ఛార్జ్ చేయడం ఏంటని.. అది ఎక్కువ కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
దీనిమీద రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్టమర్ నుంచి ఎలాంటి అదనపు డబ్బులు వసూలు చేయలేదు. 2018లో భారతీయ రైల్వేలు జారీ చేసిన సర్క్యులర్లో, రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో రిజర్వేషన్ లో వెడుతున్నప్పుడు.. ప్రయాణీకుడు భోజనం బుక్ చేయనప్పుడు, ప్రయాణం సమయంలో టీ, కాఫీ లేదా ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి రూ. 50 సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అది కేవలం ఒక కప్పు టీ అయినా సరే అని ఉంది.
దీనికంటే ముందు రాజధాని లేదా శతాబ్ది వంటి రైళ్లలో టికెట్ లో, ఫుడ్ బిల్ కలిసే ఉండేది. కానీ, 2018 రివైజ్డ్ సర్క్యూలర్ తరువాత అది ఐచ్ఛికం చేయబడింది. అంటే, ప్రయాణీకులు కోరుకుంటే, వారు ఆ రైళ్లలో ఆహారం, టిఫిన్లు తీసుకోకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు టికెట్ లో ఫుడ్ ఖర్చు కలవదు. కేవలం టికెట్ కు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.