
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఆప్ నేత సుశీల్ కుమార్ రింకు పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఇటీవలి కాలంలో మరణించిన సభ్యుల మృతిపై లోక్సభ సంతాపం తెలిపింది. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ విషయానికి వస్తే.. జూన్లో మరణించిన సిట్టింగ్ ఎంపీ హరద్వార్ దూబేకి నివాళిగా సభను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
ఇక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు మొత్తం 17 పనిదినాల్లో జరగనున్నాయి. మొత్తం 31 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్పై కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఇదిలా ఉంటే, పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి కొంతసేపటి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. మణిపూర్ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న వేధింపుల ఘటన సిగ్గుచేటని అన్నారు. ‘‘ఇది ఏ దేశానికైనా అవమానకరమైన సంఘటన. ఇది దేశానికి అవమానం. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు సిగ్గుపడుతున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం శాంతిభద్రతలను పటిష్టం చేయాలని తాను ముఖ్యమంత్రులను కోరుతున్నాను. దోషులను విడిచిపెట్టబోమని.. చట్టం తన పూర్తి శక్తితో పనిచేస్తుందని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. మణిపూర్ కుమార్తెలకు జరిగిన దానిని క్షమించలేము. ఎవరినీ విడిచిపెట్టము. ఈ సంఘటనపై నా హృదయం కోపం, బాధతో నిండి ఉంది’’ అని మోదీ చెప్పారు.
ఇక, ‘‘ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో సమావేశమవుతున్నప్పుడు.. ఎంపీలందరూ కలిసి దీన్ని గరిష్టంగా ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించుకుంటారని, ఎంపీలుగా తమ బాధ్యతలను నిర్వహిస్తారని నాకు నమ్మకం ఉంది’’ ప్రధాని మోదీ అన్నారు.
ఇదిలా ఉంటే, మణిపూర్ ఘటనపై పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ అంశంపై చర్చించాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే కేంద్రం కూడా తాము అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా చెబుతోంది.