
అహ్మదాబాద్: వివాహ వేడుకలో ఏర్పాటుచేసిన విందు ఆరగించి ఏకంగా 1200మంది తీవ్ర అస్వస్థతకు గురయిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లికి హాజరై భోంచేసిన వారు వాంతులు, విరేచనాలు చేసుకుంటూ హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఒకేసారి ఇంతభారీ సంఖ్యలో అనారోగ్యానికి గురవడంపై ఫుడ్ ఆండ్ డ్రగ్స్ శాఖ విచారణ చేపట్టింది.
వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రం (gujarat food poison)లోని మెహసనా జిల్లాలోని విస్ నగర్ తాలుకా సలావా గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడి కుమారుడి పెళ్లి జరిగింది. వివాహానికి వచ్చే అతిథులకు మాంసాహారంతో పాటు శాఖాహారంతో విందు ఏర్పాటు చేసారు. ఇలా ఘనంగా ఏర్పాటుచేసిన వివాహంలో అపశృతి చోటుచేసుకుంది.
పెళ్లికి హాజరై విందు ఆరగించిన అతిథులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇలా దాదాపు 1200మంది వరకు డయేరియా వంటి సమస్యతో బాధపడుతూ జిల్లాలోని వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. పెళ్ళి వేడుకలో ఫుడ్ పాయిజన్ కారణంగానే వీరంతా అస్వస్థతకు గురయ్యారని అనుమానిస్తున్నారు.
ఒకేసారి ఇంతభారీ సంఖ్యలో ఒకే తరహా లక్షణాలతో అస్వస్థతకు గురయి హాస్పిటల్ పాలవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు కాంగ్రెస్ నాయకుడి పెళ్లివేడుకలో వడ్డించిన ఆహార నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు ఫుడ్ ఆండ్ డ్రగ్స్ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి హృషికేష్ పాటిల్ బాధితుల క్షేమసమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదిలావుంటే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇలాగే ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో పెళ్లి భోజనం ఆరగించి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు,విరేచనాలతో చిన్నారులు, పెద్దలు హాస్పిటల్ పాలయ్యారు.
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. పెళ్లి భోజనం తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఏడు మంది పెద్దలకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేసారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా హాస్పిటల్ పాలయని వారంతా కకోలుకుని సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు.