ఒడిశా రైలు ప్రమాదానికి కారణం గుర్తించినట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ చెప్పారు.
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ లో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గల కారణాలను గుర్తించామని రైల్వే శాఖ మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ చెప్పారు. బాలాసోర్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాక్ మరమ్మత్తు పనులను కేంద్ర మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ ఆదివారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పుడే పూర్తి వివరాలను వెల్లడించలేమన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అంతేకాదు మృతదేహలను ఆసుపత్రులకు తరలించినట్టుగా మంత్రి తెలిపారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం లోపుగా రైల్వేట్రాక్ పునరుద్దరణ పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణ పూర్తైతే వెంటనే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్దరించనున్నట్టుగా మంత్రి తెలిపారు.
కోరమండల్ రైలు ప్రమాదానికి గల బాధ్యులను కూడా గుర్తించామని మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ వివరించారు. ఈ ప్రమాదంపై కమిషనర్ రైల్ సేఫ్టీ విచారణ చేస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదిక సిద్దమైందని కేంద్ర మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
also read:కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 12 మంది ఆచూకీ లేదు: మంత్రి గుడివాడ
శుక్రవారంనాడు రాత్రి నుండి ప్రమాదం జరిగిన స్థలంలోనే సహాయక చర్యలను మంత్రి ఆశ్విన్ వైష్ణవ్ పర్యవేక్షిస్తున్నారు. ఆగ్నేయ రైల్వే లైన్ ను పర్యవేక్షించేందుకు ఆదివారం నాడు హౌరా నుండి బాలాసోర్ , హౌరా నుండి బాలాసోర్ కు రెండు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతుంది.