
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించడం మీద అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు రైతు దీక్షలకు మద్దతు తెలుపుతున్నారు.
బుధవారం నుంచి ఈ మేరకు ట్టిటర్ వేదికగా సంఘీభావం వెల్లవెత్తుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ప్రపంచంలోని ప్రముఖులు చేస్తున్న ఈ ట్వీట్లపై భారత్ కు చెందిన పలువురు ప్రముఖులు భారత ఐక్యతకు కట్టుబడి ఉండాలంటూఘాటుగా స్పందిస్తున్నారు.
దేశ ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరంటూ ధీటుగా సమాధానమిస్తున్నారు. సినీ నటుడు అక్షయ్ కుమార్,అజయ్ దేవగన్తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, కేంద్ర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు కేంద్రానికి మద్దతుగా నిలిచారు.
ట్విటర్ వేదికగా సాగుతున్న ఈ వార్ పెను దుమారం రేపుతోంది. బుధవారం రైతు అనుకూల, ప్రభుత్వ అనుకూల పోస్టులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరోవైపు సాగుచట్టాలపై రైతుల ఆందోళనకు అంతర్జాతీయ మద్ధతుపై కేంద్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆన్ లైన్ లో బ్రిటన్ పార్లమెంటుకు లక్షకు పైగా సంతకాలు పంపడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. సంతకాలు చేసిన వారిలో పలువురు భారత సంతతివారు కూడా ఉన్నారు. అంతర్జాతీయ ప్రముఖుల మద్దతుపై విదేశాంగ శాఖ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. రైతుల ధర్నాకు ప్రముఖుల మద్దతును ఆయన తీవ్రంగా ఖండించారు. భారతదేశ ఐక్యతను ఏ ప్రచారం దెబ్బతీయలేదన్నారు. అభివృద్ధే దేశ భవిష్యత్ను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.