
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గౌరవ్ గోగోయ్ అవిశ్వాస తీర్మాన నోటీసు అందించారు.
మణిపూర్ అంశంపై లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. నాలుగు రోజులుగా పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఈ అంశంపై నిరసనలకు దిగుతున్నాయి. అయితే మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ప్రకటనకు అవిశ్వాసం అంశాన్ని విపక్షాలు అస్త్రంగా వినియోగించాలని భావించాయి. ఈ మేరకు మంగళవారంనాడు విపక్ష పార్టీల ఇండియా కూటమి ఈ నిర్ణయం తీసుకుంది.
అవిశ్వాస తీర్మానానికి సంబంధించి తమకు సంఖ్య బలం లేదని విపక్షాలకు తెలుసు. అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ పార్లమెంట్ లో ప్రసంగించాల్సి ఉంటుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా చెప్పారు. లోక్ సభలో 332 మంది ఎంపీల బలం ఎన్డీఏకు ఉంది. మోడీ సర్కార్ ను ఓడించడం సాధ్యం కాదని విపక్షాలకు తెలుసు. ఇవాళ ఉదయం 9:20 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవిశ్వాస తీర్మాన నోటీసును లోక్ సభ సెక్రటేరియట్ లో సమర్పించారు.
అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టడం విపక్షాలకు చివరి అవకాశంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. మరో వైపు ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఇవాళ పార్లమెంట్ కు విధిగా హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇవ్వడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పందించారు. 2018లోనే విపక్షాలు అవిశ్వాసంలో విఫలమైన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.
గతంలో అవిశ్వాసం పెట్టి తమ పార్టీకి 300కు పైగా ఎంపీ సీట్లు దక్కాయన్నారు. ఈ దఫా అవిశ్వాసం పెట్టి 350 ఎంపీ సీట్లు దక్కేలా చేస్తున్నారని విపక్షాలపై మంత్రి సెటైర్లు వేశారు.2018లో మోడీ సర్కార్ పై టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది. ఏపీ విషయంలో మోడీ సర్కార్ నిర్లక్ష్యంపై టీడీపీ అవిశ్వాసం ప్రవేశ పెట్టింది. 325-126 ఓట్ల తేడాతో అవిశ్వాస తీర్మానంపై మోడీ సర్కార్ విజయం సాధించింది.