
న్యూఢిల్లీ: అండర్వరల్డ్ డాన్, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫోకస్ చేసినట్టు తెలుస్తున్నది. ఈ డీ కంపెనీపై టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్వర్క్ కార్యకలాపాలను తవ్వి తీయాలని, వాటిని కట్టడి చేయాలనే లక్ష్యంతో ఓ బృందం ఇప్పటికే దుబాయ్ వెళ్లిందని విశ్వసనీయవర్గాలు సమాచారం ఇచ్చాయి. ఆ టీమ్లో ఇంటెలిజెన్స్ బ్యూరో, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఉన్నట్టు తెలిసింది.
గతేడాది ఎన్ఐఏ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహిత అనుచరులు ఛోటా షకీల్, మరో ముగ్గురిపై ఓ టెర్రర్ కేసులో చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసు గ్లోబల్ టెర్రరిస్ట్ నెట్వర్క్కు సంబంధించినది. అంతర్జాతీయంగా క్రైమ్ సిండికేట్గా ఏర్పడి డీ కంపెనీకి సంబంధించిన కేసు అని ఎన్ఐఏ ఏజెన్సీ గతంలో వెల్లడించింది. ఈ డీ కంపెనీకి భారత్లో జరిగిన అనేక టెర్రరిస్టు, నేర కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నదని వివరించింది.
Also Read: యూనివర్సిటీ ఫెస్ట్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 26 ఏళ్ల యువకుడు.. మృతి
దుబాయ్కి చెందిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో ఎన్ఐఏ అధికారులు భేటీ అవుతారని, టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ గురించి ఆరా తీస్తారని కొన్ని వర్గాలు జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు తెలియజేశాయని రిపోర్ట్ చేసింది.
డీ కంపెనీ కార్యకలాపాలను విస్తరించడానికి పాకిస్తాన్ నుంచి దుబాయ్ మీదుగా హవాలా మార్గాల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఇండియాకు చేరిందని ఇటీవలే ఎన్ఐఏ తెలిపింది. ముంబయి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో టెర్రరిస్టు, క్రిమినల్ కార్యకలాపాలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి డబ్బు పొందినట్టు ఓ కేసులో నిందితులు ఎన్ఐఏకు తెలిపినట్టు సమాచారం.