
జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. తీవ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్ రాజౌరిలోని అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో రాజౌరి, పూంచ్, జమ్మూ, శ్రీనగర్, పుల్వామా, బుద్గామ్, షోపియాన్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.
నిర్దిష్టమైన సమాచారంతో ఎన్ఐఏ సోదాలు జరుపుతుందని తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు చెందిన పలు బృందాలు ఈ సోదాలు పాల్గొన్నాయి. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ల సమన్వయంతో ఎన్ఐఏ ఈ సోదాలు కొనసాగిస్తుంది.
ఇక, అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిధుల తీరు, కార్యకలాపాలపై ఎన్ఐఏ గతంలో సుమోటో కేసు నమోదు చేసింది. 2019లో చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చట్టవిరుద్దమైన సంఘంగా ప్రకటించిన జమాతే ఇస్లామీ జమ్మూ కశ్మీర్ కోసం అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫ్రంటల్ ఎంటిటీగా పనిచేస్తున్నట్టుగా ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.