
Godse road: కర్నాటకలోని ఉడిపి జిల్లాలో మరో కొత్త వివాదం చోటుచేసుకుంది. ఇటీవల ఉడిపి జిల్లాలో నిర్మించిన ఓ రహదారిలో పెట్టిన సైన్ బోర్డు కలకలం రేపింది. వివాదానికి దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది..? ఆ వివాదానికి కారణమేంటీ? అసలు ఆ సైన్ బోర్డు లో ఏముందనీ ఆలోచిస్తున్నారా..?
వివరాల్లోకెళ్తే.. ఉడిపి జిల్లాలోని కర్కల తాలూకాలోని బోలా గ్రామంలో ఇటీవల నిర్మించిన రోడ్డులో కొందరు గుర్తు తెలిపిన వారు నాథూరామ్ గాడ్సే పేరుతో ఉన్న ఓ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు. స్థానికుల సమాచారం మేరకు.. రెండు రోజుల క్రితం అంటే శనివారం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఈ బోర్డు పెట్టగా సోమవారం దానిని ప్రజలు గమనించారు.
గ్రామపంచాయతీ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ బోర్డుపై కన్నడ లిపిలో 'పాడుగిరి నాథూరాం గాడ్సే రోడ్డు' అని రాసి ఉంది. నాథూరామ్ గాడ్సే పేరుతో ఉన్నసైన్ బోర్డు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహాత్మ గాంధీని చంపిన వ్యక్తి పేరుతో సైన్ బోర్డు ఏర్పాటు చేయడమేంటని స్థానికులు మండిపడింది.
ఈ విషయం పంచాయతీ అభివృద్ధి అధికారి దృష్టికి వెళ్లడంతో ఆ బోర్డును వెంటనే తొలగించారు. రోడ్డుకు పేరు పెట్టేందుకు పంచాయతీ నుంచి ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని పంచాయతీ అభివృద్ధి అధికారి గ్రామ పంచాయతీకి తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ బోర్డు పెట్టారని తెలిపారు. అనంతరం దీనిపై స్థానిక పోలీసులకు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ బోర్డు ఎవరు ఏర్పాటు చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి వి. సునీల్ కుమార్ నియోజకవర్గమైన బోలో గ్రామపంచాయతీలో ఈ సైన్ బోర్డును ఏర్పాటు చేశారు.