కరోనా : గంట వ్యవధిలోనే నా తల్లి, భర్తను కోల్పోయా.. ఓ మాజీ ఉన్నతోద్యోగి ఆవేదన..

By AN TeluguFirst Published May 4, 2021, 1:33 PM IST
Highlights

కరోనా వైరస్ విజృంభణ ఎన్నో విషాద గాధల్ని వినిపిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలనే కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తాజాగా మాజీ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ అర్చనా దత్తా ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

కరోనా వైరస్ విజృంభణ ఎన్నో విషాద గాధల్ని వినిపిస్తోంది. కుటుంబాలకు కుటుంబాలనే కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తాజాగా మాజీ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ అర్చనా దత్తా ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

కరోనాతో తన తల్లిని, భర్తను గంటల వ్యవధిలో కోల్పోయానని.. ఇంట్లో మిగతా వారి పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

బెడ్స్ ఆక్సిజన్ కొరతతో ఎంతోమంది కరోనా బాధితులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. దిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో చాలా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘటనలో వెలుగుచూస్తున్నాయి.

తాజాగా సరైన వైద్య చికిత్స అందకపోవడంతోనే తన భర్త, తల్లి మరణించారని మాజీ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ అర్చన దత్తా ఆరోపించారు. ఏప్రిల్ 27న మాల్వియా నగర్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్చన తన భర్త, తల్లిని కోల్పోయారు. ఈ విషాదాలు కేవలం గంట వ్యవధిలోనే చోటుచేసుకోవడం మరింత దారుణం.

చనిపోయిన తరువాత ఇద్దరికీ కరోనా నిర్ధారణ అయిందన్నారు .ఈ మేరకు ట్విట్టర్లో ఆమె భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తన తల్లి, భర్తను ఆసుపత్రిలో చేర్చడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఒక గంట వ్యవధిలోనే తన తల్లి, భర్తను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

‘నాలాగే చాలామంది తమ కుటుంబానికి అన్యాయం జరగకూడదని అనుకుంటారు. కానీ అదే జరిగింది. నా తల్లి, భర్త ఇద్దరూ చికిత్స అందకుండానే మరణించారు. ఢిల్లీలోని ఎన్నో ప్రముఖ ఆసుపత్రులు తిరిగాం. కానీ వారు చేర్చుకోలేదు. వారు మృతి చెందాక కరోనా పాజిటివ్‌ అని తేలింది.’ అని ట్వీట్‌ చేశారు.

ప్రతిభాపాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రతినిధిగా  అర్చన దత్తా పనిచేశారు. కాగా అర్చన భర్త ఎఆర్ దత్తా రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసి విరమణ పొందారు. ఎఆర్ దత్తా (68), అర్చన తల్లి బనీ ముఖర్జీ (88) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అర్చన కుమారుడు అభిషేక్ వారిద్దరినీ దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అయితే అక్కడ వారు చేర్చుకోలేదు. ఇలా పలు ఆసుపత్రుల్లో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ.. అప్పటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గంటల వ్యవధిలోనే వారిద్దరూ మరణించారు. 

ప్రస్తుతం తమ కుటుంబంలో అభిషేక్ మినహా అందరూ కోవిద్ బారిన పడినట్లుగా అర్చన వెల్లడించారు. తన మేనకోడలి పరిస్థితి క్షీణిస్తోందని.. ఆక్సిజన్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
 

click me!