
Supreme Court: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తూ దేశంలోని 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. సీబీఐ, ఈడీల ద్వారా ప్రతిపక్ష నేతలను నిరంతరం టార్గెట్ చేస్తున్నారని ఆరోపించాయి. ఈ క్రమంలోనే అరెస్టు, బెయిల్ పై మార్గదర్శకాలను రూపొందించాలని పార్టీలు సుప్రీంకోర్టును కోరాయి. ఈ పిటిషన్ ను త్వరగా విచారించాలని చీఫ్ జస్టిస్ ను కోరారు. ఇరుపక్షాల డిమాండ్ పై ఏప్రిల్ 5న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 14 పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ అంశాన్ని ఉంచారు. ఈ కేసు ఇప్పుడు ఏప్రిల్ 5న విచారణకు రానుంది. ఈ 14 పార్టీల జాబితాలో కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, ఎన్సీపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఉన్నాయి. ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
ఈ పార్టీలు ఉమ్మడిగా దేశ ఓటర్లలో 42 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయని సింఘ్వీ చెప్పారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశాన్ని కోర్టు ముందు లేవనెత్తాలని ఈ పార్టీలు భావిస్తున్నాయని ఆయన అన్నారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటోందని పార్టీలు ఆరోపిస్తున్నాయని సింఘ్వీ తెలిపారు. రాజకీయ నాయకులపై 95 శాతం కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని సింఘ్వీ పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన కేసుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనీ, అయితే అరెస్టు, బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన అన్నారు. కొద్దిసేపు న్యాయవాది వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఈ కేసును ఏప్రిల్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.