
కేరళ : లాటరీలకు పెట్టింది పేరు కేరళ. రకరకాల అకేషన్ ల పేరుతో లాటరీలు ఇక్కడ సామాన్యులను కోటీశ్వరులను చేస్తుంటాయి. ప్రభుత్వ ఆధీనంలోనూ లాటరీలు నడుస్తుంటాయి. లాటరీ ఇక్కడ తప్పుకాదు. అయితే, ఒకవేళ లాటరీ కొడితే మాత్రం.. ఆ సామాన్యుడు భయంతో గజగజా వణికి పోవాల్సిందే. అలాంటి విచిత్ర అనుభవం ఎదురయింది ఓ వ్యక్తికి. ఎందుకు? ఏమిటి? ఎలా? అంటే…
కేరళలో నిర్వహించిన ఒక లాటరీలో ఓ వలస కార్మికుడు కోటి రూపాయలు గెలుచుకున్నాడు. ఆ తరువాత వెంటనే అతడిని భయం వేటాడింది. ‘నన్ను కాపాడండి’ అంటూ పోలీస్ లను ఆశ్రయించాడు. విషయం తెలియని పోలీసులు ఎవరైనా అతనిని వెంటాడుతున్నారేమో అని భావించారు. కానీ అతను చెప్పిన విషయం విని అవాక్కయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిర్షు రాంబా అనే కార్మికుడు కేరళకు వలస వెళ్లాడు.
ప్రస్తుతం కేరళలో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అక్కడ లాటరీ అధికారికమే కాబట్టి… సరదాగా ఓ లాటరీ కొన్నాడు. దాని పేరు 50-50. అతడిని అదృష్టం వరించింది. అతడు కొన్న లాటరీ నెంబర్ కు కోటి రూపాయల బహుమతి దక్కింది. ఈ విషయం తెలుసుకున్న అతడు ఒక క్షణం సంతోషంలో మునిగిపోయాడు. ఆ తర్వాత వెంటనే అతడిని భయం గజగజ వణికించింది. కారణం ఏంటంటే.. ఆ డబ్బుల కోసం తనను ఎవరైనా చంపేస్తారేమో అని ఆందోళన చెందాడు.
వెంటనే రాంబా సమీపంలో ఉన్న తంపనూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. పోలీసులకు తను లాటరీ కొనడం, దానికి బహుమతి రావడం అన్ని చెప్పాడు. తనని ఎవరైనా డబ్బుల కోసం చంపేస్తారేమోనని తనకు రక్షణ కల్పించాలంటూ కోరాడు. అంతేకాదు.. లాటరీలో గెలుచుకున్న డబ్బులను ఎలా తీసుకోవాలో కూడా తనకు తెలువదని.. నిర్వాహకుల నుంచి ఆ డబ్బులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశాడు. ఇదంతా విన్న పోలీసులు అవాక్కై ఆ తర్వాత.. ఏం కాదు అని జాగ్రత్తగా ఉండమంటూ చెబుతూ.. అతనికి డబ్బులు ఇప్పిచ్చేలా చర్యలు చేపట్టారు. డబ్బులను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలని రాంబాకు తెలిపారు.