
తమిళనాడు : Tamil Naduలోని తిరుచ్చిలో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలిక తన ప్రేమను అంగీకరించలేదని 22 ఏళ్ల యువకుడు ఆమెను14 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆ వ్యక్తిని కేశవన్గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెడితే.. తిరుచ్చిలోని అతికుళంలో నివాసముంటున్న బాలిక 11వ తరగతి చదువుతోంది. కాలేజ్ లో పరీక్షలు రాసిన తరువాత బాధితురాలు తన బంధువుల వద్దకు వెడుతోంది. ఆ సమయంలో రైల్వే ఓవర్పాస్ సమీపంలో నిందితుడు కేశవన్ ఆమెను అడ్డుకున్నాడు. కొంతకాలంగా కేశవన్ బాలికను వెంబడిస్తున్నట్లు సమాచారం.
జూన్ 2021లో ఈ బాలికను కిడ్నాప్ చేసినందుకు కేశవన్పై బాలల లైంగిక నేరాల రక్షణ చట్టం, 2012 (పోక్సో) కింద కేసు నమోదయ్యిందని.. ఆ సమయంలో పోలీసులు అరెస్టు చేసినట్లు బాధితురాలి బంధువు పేర్కొన్నాడు. అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. కత్తిపోటు ఘటన జరిగిన రోజు... పొడవడానికి ముందు బాలికకు తాను ఆమెతో ప్రేమలో ఉన్నానని చెప్పాడు. దీనికి ఆ బాలిక నిరాకరించింది. దీంతో ఆమె అరిచి, గొడవ చేస్తుందని భావించాడు. దీంతో ఆమె సాయం కోసం కేకలు వేయకముందే కేశవన్ 14 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తరువాత కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు.
కాగా, రైల్వే ఓవర్పాస్ దగ్గర ఈ ఘటన జరగడంతో అక్కడున్న ప్రయాణికులు బాలిక కిందపడిపోవడాన్ని గమనించారు. దగ్గరికి వచ్చి చూసేసరికి రక్తం మడుగులో పడి ఉంది. వారు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
నిందితుడిని తిరుచ్చి పోతామెట్టుపట్టికి చెందిన కేశవన్గా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కరూర్ కాంగ్రెస్ ఎంపీ జోతిమణి ట్వీట్ చేస్తూ.. ఓ పాఠశాల విద్యార్థిని 14 సార్లు కత్తిపోట్లకు గురైందని విని షాక్కు గురయ్యానని అన్నారు. కేశవన్ను అరెస్టు చేసేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)తో మాట్లాడినట్లు ఆమె తెలిపారు.
ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడల్లా మనసు వికలం అవుతోంది.. ఈ ఘటనలు జరిగినప్పుడు స్త్రీ అనేది కేవలం ఆటబొమ్మగా పురుషుడు భావిస్తారని.. ఆమెకు ఆలోచనలు, ఇష్టాయిష్టాలు లేని ఒట్టి శరీరం అనే భావన నుండి మాత్రమే ఉత్పన్నమవుతుంది. కఠోరమైన శిక్షలతో పాటు సమాజంలో ఇలాంటి విపరీతమైన మనస్తత్వాన్ని విద్య ద్వారా మార్చాలి' అని జోతిమణి ట్వీట్ చేశారు.
తన ప్రేమ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో మైనర్ బాలికపై కేశవన్ 14 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తరువాత అక్కడి నుంచి అతను పరారీ అయ్యాడు. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి రైల్వే ట్రాక్పై నిందితుడు శవమై కనిపించాడు.
బాలిక మీద దాడి చేసింది కేశవన్ అని గుర్తించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేయగా, మణప్పరై సమీపంలో రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్లు సమాచారం అందండంతో ఈ కేసు మరో ట్విస్ట్ ఎదురయ్యింది. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహం దగ్గర నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేశవన్ తండ్రిని తీసుకువచ్చి చూపించగా మృతదేహం కేశవన్ దేనని గుర్తించాడు.