
మనలో చాలా మంది పామును అంత దూరంలో చూస్తేనే భయంతో వణికిపోతాం. బతికున్న పామును పట్టుకోవాల్సి వస్తే, పై ప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది ఓ వ్యక్తి బతికున్న పామును నమిలి మింగేశాడు. అది కూడా దాని మీద కూల్ డ్రింక్ పోసుకొని మరీ నమిలేశాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా లోని నగీనా కాలనీకి చెందిన కమలేష్(34) మద్యానికి బానిసగా మారాడు. తమ గ్రామంలో పాత కట్టడాల కూల్చివేత జరుగుతూ ఉండగా అతనికి ఓ పాము కనిపించింది. దానిని చూసిన కమలేష్ వెంటనే ఆ పామును పట్టుకున్నాడు. అప్పటికే విపరీతంగా మద్యం సేవించి ఉన్న కమలేష్ ఆ పాము తల కొరికేశాడు. అనంతరం రక్తం కారుతున్న పాము తలపై కూల్ డ్రింక్ పోసుకొని మరీ నమిలేశాడు.
అది విష సర్పం అని దానిని కొరికితే చచ్చిపోతావు అంటూ గ్రామస్థులు హెచ్చరించడంతో వెంటనే నోట్లోని పామును ఊసేశాడు. పాము మాత్రం చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కమలేష్ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని జైలుకు తరలించారు. కమలేష్పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతని ప్రాణానికి మాత్రం ఎలాంటి హాని కలగలేదని వారు చెప్పారు.