పామును ముద్దాడబోతే... కసిదీరా పెదవులపై కాటేసింది.. చికిత్స తీసుకుంటూ....

By SumaBala BukkaFirst Published Nov 16, 2022, 7:16 AM IST
Highlights

పాము కాటుతో మనిషి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పామును ముద్దాడబోతే అది కాటేసింది. 

మహారాష్ట్ర : పామును ముద్దాడేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. అది విషసర్పం అని తెలిసీ ఆటలాడబోయాడు. అది ఊరుకుంటుందా.. ఎంచక్కా కాటేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. నాశిక్ సిన్నర్ కు చెందిన నాగేష్ పాముల సంరక్షుడు శుక్రవారం ఓ పామును పట్టుకున్నాడు. ఆ తరువాత దాన్ని తీసుకుని తన స్నేహితుని కేఫ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ తన హీరోయిజం చూపిద్దామనుకున్నాడో ఏమో... కానీ.. ఆ పామును మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మేడమీదికి తీసుకువెళ్లాడు.

అక్కడ పాముతో విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. అసలే పట్టుకున్నాడన్న చిరాకులో ఉందేమో పాము.. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని అదీ చూస్తున్నట్లుంది. ఇదేమీ పట్టని నాగేష్ పామును ముద్దాడేందుకు ప్రయత్నించాడు. అది అమ్మాయా..? సిగుపడడానికి లేదా ముద్దివ్వడానికి.. కసితీరా పెదాలపై కాటేసింది. ఆ తరువాత పారిపోయింది. ఇది చూసి షాకైన అతని స్నేహితులు.. అప్రమత్తమై అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. 

భారత్‌లో నివసించే వారంతా హిందువులే: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్

ఇదిలా ఉండగా, ఓ వ్యక్తి పామును కరిచి చంపిన ఘటన ఈ అక్టోబర్ 31న ఛత్తీస్ గఢ్ లో జరిగింది. చత్తీస్ గఢ్ లోని జశ్ పుర్ జిల్లా పంద్రపుత్ గ్రామంలో పహాఢీ కోర్వా గిరిజన తెగకు చెందిన పన్నెండేళ్ల దీపక్ రామ్ అనే బాలుడు తన నివాసానికి సమీపంలో ఉన్న, తన సోదరి ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ పాము అతని చేతిపై కాటు వేసింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన దీపక్ పారిపోతున్న పామును వెంబడించి మరీ దొరికి పుచ్చుకున్నాడు. వెంటనే దాన్ని గట్టిగా కొరికేసాడు. ఆ తర్వాత విషయం తెలియడంతో దీపక్ ను అతని సోదరి ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారట. దీంతో ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పింది. అతడిని కరిచిన పాము మాత్రం మరణించింది.

అక్టోబర్ 14న ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. ఓ తాగుబోతు నాగుపాము తనను రెండు సార్లు కాటేసి.. అదే చచ్చిపోయింది అంటూ ఆస్పత్రికి పరుగెత్తుకు వచ్చాడు. అంతే కాదు, ఒక పాలిథిన్ కవర్లో చచ్చిపోయిన నాగుపామును పెట్టుకుని మరీ వెంట తీసుకొచ్చాడు. యూపీలోని ఖుషినగర్ ఆస్పత్రిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. కవర్లో కింగ్ కోబ్రా కళేబరంతో వచ్చాడు ఓ వ్యక్తి. తన పాదం మీద రెండు చోట్ల ఆ పాము కరిచిందని ఆ వ్యక్తి చెప్పాడు.  అంతేకాదు తనకు ఏదైనా వ్యాక్సిన్ ఇవ్వమని వైద్యులను అడిగాడు. దీంతో మనిషిని కరిచి పాము చనిపోవడం ఏంటో అర్థం కాక డాక్టర్లు నోరెళ్లబెట్టారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే సెప్టెంబర్ 8న ఒడిశాలో వెలుగు చూసింది. మనిషి  పాము మీద పగపట్టాడు. మీరు విన్నది నిజమే..  పాము మనిషి మీద పగపట్టడం గురించి కాదు… మనిషి పాము మీద పగ పట్టడం గురించి ఈ స్టోరీ. మనిషి పామును కరవడంతో అది మృతి చెందింది. ఇదేదో ఫిక్షనల్ కథ కాదు. అచ్చమైన నిజ జీవిత వాస్తవం. ఒడిశాలోని బలేశ్వర్ జిల్లా దొరొడా గ్రామంలో ఈ ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. బోలా శంకరుడి తరహాలో కాటేసి.. చంపేసిన పామును మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు ఓ ప్రబుద్ధుడు. మనసునిండా ఉక్రోషంతో పాము మీద పగ తీర్చుకున్నాడు. 

click me!