శక్తివంతమైన, ప్రగతిశీలమైన, యునైటెడ్ ఇండియాను నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడానికి వచ్చిన జాతీయ నాయకులకు, మద్దతుదారులకు, లక్షలాది ప్రజలకు స్వాగతం చెబుతున్నట్లు మమతా బెనర్డీ శనివారం ఉదయం ట్వీట్ చేశారు.
కోల్ కత్తా: యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీ తలపెట్టిన ర్యాలీకి 20 మందికి పైగా నాయకులు వచ్చారు. మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, అరుణ్ శౌరీలు వచ్చారు.
వారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, హెచ్ డీ కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, గీగోంగ్ అపాంగ్ హాజరయ్యారు. ర్యాలీ ప్రారంభానికి ముందు మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, డిఎంకె చీఫ్ స్టాలిన్, లోక్ తాంత్రిక్ జనతా దళ్ చీఫ్ శరద్ యాదవ్, నేషనలిస్టు పార్టీ అధినేత శరద్ పవార్ కూడా వచ్చారు.
శక్తివంతమైన, ప్రగతిశీలమైన, యునైటెడ్ ఇండియాను నిర్మించాలని ప్రతిజ్ఞ చేయడానికి వచ్చిన జాతీయ నాయకులకు, మద్దతుదారులకు, లక్షలాది ప్రజలకు స్వాగతం చెబుతున్నట్లు మమతా బెనర్డీ శనివారం ఉదయం ట్వీట్ చేశారు.
ఈ ర్యాలీకి ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కావడం లేదని తెలుస్తోంది. అయితే, మమతా బెనర్జీకి తన మద్దతు తెలుపుతూ ఆయన సందేశం పంపించారు. ఆయన తరఫున మల్లికార్జున్ ఖర్గే, అభిషేక్ మను సింఘ్వీ వచ్చే అవకాశం ఉంది.
బిఎస్పీ అధినేత మాయావతి కూడా ర్యాలీకి రావడం లేదు. ఆమె తరఫున పార్టీ నేత సతీష్ చంద్ర మిశ్రా వస్తున్నారు. బహిరంగ సభ జరిగే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఏడు లక్షల మందికి సరిపడా ఉంటుంది. అయితే, ర్యాలీకి 40 లక్షల మంది హాజరవుతారని తృణమూల్ కాంగ్రెసు చెబుతోంది.