
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగాల్ లో మరోసారి అధికారం దక్కించుకున్నారు. అయితే... నందిగ్రామ్ లో మాత్రం ఆమె ఓడిపోయారు. ఆమె మీద పోటీచేసిన బీజేపీ నేత సువేంద్ అధికారి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
కాగా.. ఈ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ.. మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె కోర్టులో సవాల్ చేయడంతో.. కోర్టు ఏం చెబుతుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా... మే 2న జరిగిన ఓట్ల లెక్కింపు సందర్భంగా నందిగ్రామ్ కౌంటింగ్ సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలి 11 రౌండ్లలో అధికారి వెనుకంజలో ఉన్నప్పటికీ.. తర్వాత నాలుగు రౌండ్లలో ఆయన అనూహ్యంగా పుంజుకున్నారు. ఓ దశలో ఏకంగా 11 వేల ఓట్ల తేడాతో ముందంజలో కొనసాగారు.
దీనిపై దీదీ అనేక అనుమానాలు లేవనెత్తారు. కౌంటింగ్ సమయంలో నాలుగు గంటల పాటు సర్వర్ డౌన్ అయ్యిందని.. ఆ సమయంలో అవకతవకలు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. తాను గెలుపొందానని.. దానికి గవర్నర్ సైతం శుభాకాంక్షలు తెలియజేశారని పేర్కొన్నారు. కానీ, ఒక్కసారిగా ఫలితాలన్నీ తారుమారయ్యాయని వాపోయారు. రీకౌంటింగ్ కోరినప్పటికీ ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు