
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటికే 70 పైగా దేశాలకు పాకిన ఈ వైరస్ భారత్ లోనూ విస్తరిస్తోంది. రోజురోజుకూ ఈ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
తాజా కేసులతో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 113 కి చేరింది. దీంతో భారత్ టెన్షన్ మోడ్ లోకి వెళ్లింది.
తాజాగా.. మహారాష్ట్రలో మరో 8 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో అత్యధికంగా 40 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో పూణేలో 6, ముంబాయిలో 1, కళ్యాణ్ డోంబివాలి 1 కేసు నమోదు అయినట్టు ప్రభుత్వం తెలిపింది. మహరాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే.. ముంబయి-14, పింప్రి చించ్వాడ్-10, పూణే (గ్రామీణ)-6, పూణే మున్సిపల్ కార్పొరేషన్-2, కళ్యాణ్ డోంబివాలి-2 , ఉస్మానాబాద్-2, లాతూర్ -1, బుల్దానా-1, నాగ్పూర్-1, మరియు వసాయి విరార్-1కేసులు నమోదయ్యాయి. వీటిలో 25 కేసులు ప్రతికూల RT PCR పరీక్ష తర్వాత విడుదలయ్యాయని DHNS పేర్కొంది.
మరోవైపు.. మహారాష్ట్రలో కొత్తగా 877 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు. కాగా.. అదే సమయంలో 19 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 1,41,317 కు చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 632 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారనీ, తాజా డిశ్చార్జ్ కేసులతో మొత్తం రికవరీ సంఖ్య 64,95,249కి చేరుకుందని వైద్య శాఖ తెలిపింది. అలాగే.. మహారాష్ట్రలో కోవిడ్-19 రికవరీ రేటు 97.72 శాతం కాగా, మరణాల రేటు 2.12 శాతంగా ఉంది.
ఆ తరువాత స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది. ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వత రాజస్థాన్లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్లో 7, కేరళలో 7 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చండీగఢ్లలో ఒక్కో కేసు నమోదైంది.
దీంతో సెకండ్ వేవ్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ప్రజలు ఈ కొత్త వేరియంట్తో భయ భ్రాంతులకు గురవుతున్నారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఓమిక్రాన్ వేరియంట్ పై అప్రమత్తం అవుతున్నాయి. ప్రజలు ఓమిక్రాన్ వేరియంట్ పట్ల జాగ్రత్త గా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్దమవుతోంది.
Read Also :ఇక పుట్టిన వెంటనే ఆధార్.. హాస్పిటల్ లోనే ఇచ్చేందుకు UIDAI కసరత్తు..
ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. వైరస్ కేసుల పెరుగుదలను అడ్డుకోవడానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం నిబంధనలు వంటివి తప్పనిసరి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు ఆయా ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. అదే సమయంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి.